‘ఒమిక్రాన్, కరోనా ముప్పు పొంచి ఉన్నది.. వైరస్ విస్తరిస్తున్న వేళ వచ్చే మూడు వారాలు అత్యంత కీలకం.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి..ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి.. పార్టీలకు దూరంగా ఉండాలి’.. అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ.హరీశ్రావు అన్నారు. మంగళవారం బాలానగర్,కోయిలకొండలో నిర్మించిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మహబూబ్నగర్ జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మెడికల్ కళాశాలల సంఖ్య మూడుకు చేరిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు.
మహబూబ్నగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్ర స్తుతం దేశమంతా ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ రాబోయే మూడు వారాలు అత్యంత కీలకమైనవని, అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉండాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. కొవిడ్ను అన్ని విధాలా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆయన వెల్లడించారు.
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్, కోయిలకొండలో నిర్మించిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. తెలంగాణకు ముందు ఉమ్మడి పాలమూరులో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా లేదని.. ఇప్పుడు మూడు మెడికల్ కళాశాలలు వచ్చాయన్నారు. వీటి కోసం సీఎం కేసీఆర్ రూ.1,500 కోట్లు మంజూరు చేశారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇస్తే..
తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. వారు ఇవ్వకపోయినా మన సీఎం 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని తెలిపారు. 8 మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తున్నామని చెప్పారు. వీటికి అనుబంధంగా 900 పడకలతో దవాఖానలను, నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల దవాఖానలు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కొవిడ్ మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నదన్నారు. హోం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, గర్భిణులకు కరోనా వచ్చినా భయమేమీ లేదని భరోసా కల్పించారు. వారికోసం మహబూబ్నగర్లో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు కోట్ల కరోనా టెస్టింగ్ పరికరాలు, కోటి మందికి ఇచ్చేందుకు హోం ఐసోలేషన్ కిట్లు రెడీగా ఉన్నాయన్నారు. ఏఎన్ఎం సబ్ సెంటర్, పీహెచ్సీ, సీహెచ్సీ, జిల్లా, జనరల్ దవాఖానలు ఎక్కడికి పోయినా పరీక్షలు చేసేందుకు కిట్లు సిద్ధంగా ఉన్నాయని.. కొవిడ్ పాజిటివ్ అని తేలితే ఇచ్చేందుకు మందులు కూడా సిద్ధంగా ఉంచామన్నారు.
ప్రభుత్వ దవాఖానలో ఇచ్చిన మందులు ఓ వారం రోజుల పాటు వాడితే కరోనా తగ్గుతుందన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ దవాఖానలకు పోయి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. వచ్చే మూడు వారాలే అత్యంత కీలకమని.. ఈ గండం నుంచి బయట పడితే తిరిగి మనం ఎప్పటిలాగా రోజువారీ పనులు సాధారణంగా చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. పెద్ద పెద్ద దావత్లు కొన్ని రోజులు బంద్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో చైతన్యం పెంచాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, వారికి సహకరించాలని, వారి సేవలు వినియోగించుకోవాలన్నారు. మక్తల్ సమీపంలో ఓ ఏఎన్ఎం వ్యాక్సిన్ వేసేందుకు స్కూటీ మీద వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని గుర్తు చేశారు. వచ్చే నెలలో నారాయణపేట పర్యటన సందర్భంగా ఆ ఏఎన్ఎం కుటుంబానికి రూ.50 లక్షల బీమా చెక్కును అందజేయడంతోపాటు ఆదుకుంటామన్నారు.
60 ఏండ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోస్ ఇవ్వడమే కాకుండా.. పాఠశాలలు, కళాళాలలు బంద్ ఉన్నందున విద్యార్థులందరికీ టీకా వేయించాలన్నారు. జాతీయ రహదారిపై ఉన్న బాలానగర్లో ట్రామా కేర్ సెంట ర్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడే వారి ప్రాణాలు కాపాడేందుకు ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. నవాబ్పేట పీహెచ్సీ స్థాయిని పెంచుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, సంగీత, నాటక రంగ అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, డీఎంఈ రమేశ్రెడ్డి, డీసీఎంస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ నందలాల్ పవార్, డీఎంహెచ్వో కృష్ణ, నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
జీవో 317 వద్దంటే ఉద్యోగాలు వద్దన్నట్లే..
317 జీవో రద్దు చేయాలని బీజేపీ కోరుతున్నదని.. నిరుద్యోగుల కోసం సీఎం కేసీఆర్ సర్కారు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తుంటే కమలం నేతలు అడ్డుకుంటున్నారని మంత్రి హరీశ్రావు తెలిపా రు. ఈ జీవో అమలు చేసిన తర్వాత రాష్ట్రంలో మిగిలిపోయిన ఖాళీలను గుర్తించి.. యుద్ధప్రాతిపదికన 95 శాతం ఖాళీల్లో స్థానికులనే భర్తీ చేయాలని చూస్తుంటే.. బీజేపీ మాత్రం అడ్డుకునే కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. 317 జీవో ఇచ్చింది కేంద్రమేనని గుర్తు చేశారు. రాష్ట్రపతి ఆమోదం ద్వారా చట్టబద్ధత ఉన్న ఈ జీవోను మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇచ్చిందన్నారు. నాడు ఇచ్చి.. నేడు వద్దంటే ఎలా అని ప్ర శ్నించారు. తెలంగాణ వచ్చాక 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని.. త్వరలో 60 నుంచి 70 వేల ఉద్యోగాలు ఇ వ్వాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రంలో ఖాళీగా ఉన్న 10.62 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని సవాల్ విసిరారు. ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ ఇబ్బందులు పెడుతున్నదన్నారు.
‘పాలమూరు’కు జాతీయ హోదా తీసుకురావాలి..
బీజేపీ నేతలకు దమ్ముంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఏపీ, కర్ణాటక, యూపీ రాష్ర్టాల్లోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిందన్నారు. సమైక్య రాష్ట్రంలో మంత్రులుగా చేసిన కాంగ్రెస్, టీడీపీ నేతలు పాలమూరుకు వలసల జిల్లాగా మాత్రమే పేరు తెచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీళ్లు జడ్చర్ల, కల్వకుర్తి దాకా తీసుకెళ్లామన్నారు. నెట్టెంపాడు, కోయిల్సాగర్, భీమా ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాకు నీరు ఇవ్వగలిగామని తెలిపారు. చెక్డ్యాంలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేశామని, పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
ఆంగ్ల మాధ్యమం గొప్ప నిర్ణయం..
ఇంకో గొప్ప నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారని మంత్రి హరీశ్రావు అన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లిష్ మీడియంలో చదువులు చెప్పాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఎంతో గొప్ప ఫలితాలు ఇస్తుందన్నారు. రానున్న రో జుల్లో ఎల్కేజీ, యూకేజీ కూడా ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయన్నారు. మన ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి స్కూళ్లలాగా తయారు చేయాలని రూ.7,289 కోట్లతో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం రూపుదిద్దుకోనున్నదన్నారు. అన్ని పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వాష్రూం, తాగునీటి సౌకర్యం, డిజిటల్ క్లాస్ రూం, డ్యుయల్ డెస్క్లు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. అనంతరం పాలమూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణను మంత్రులు పరిశీలించారు.
కేసులతోనే ‘పాలమూరు’ ఆలస్యం..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాం తాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. అది చూసి ఓర్వలేక ఈ ప్రాంత నాయకులు కేసులు వేసి ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యేలా చేస్తున్నారు. కొంద రు ప్రతిపక్ష నేతల వల్లే పనులు ఆగిపోయాయని.. లేకుంటే ఈ పాటికే చెరువుల్లోకి నీళ్లు రావాల్సింది. సమైక్య రాష్ట్రంలో అధికారం వెలగబెట్టిన వా రు ఆంధ్రా ప్రాంతానికి ఇక్కడి నుంచి సాగునీటిని తరలించేందుకు హారతులు పట్టారు. వారికి ఆ సమయంలో ఇక్కడి సమస్యలు గుర్తుకురాలేదు. 2015లో మహబూబ్నగర్ మెడికల్ కళాశాల ఏర్పాటుకు జీవో వస్తే తమ హయాంలో వచ్చిందని అబద్ధాలు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ వంటి సీఎం తమకు ఎందుకు లేరని ఇతర రాష్ర్టా ల ప్రజలు బాధపడుతున్నారు. కర్ణాటకలోని రాయిచూరు బీజేపీ ఎమ్మెల్యే తమ ప్రాంతా న్ని తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలోనే మహబూబ్నగర్లో సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులు ప్రారంభిస్తాం. – శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి
కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు..
గతంలో ఇక్కడ చిన్న పీహెచ్సీ ఉండేది. ఇప్పుడు సువిశాల వాతావరణంలో 30 పడకలతో సీహెచ్సీ ఏర్పాటు చే సుకున్నాం. సబ్సెంటర్ స్థాయి నుంచే సీఎం కేసీఆర్ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. పీహెచ్సీ స్థాయిలోనూ డె లివరీలు చేసే పరిస్థితికి చేరుకున్నాం. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయి. రాష్ట్రంలోని డయాలసిస్ సేవలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి. విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తునందుకు ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి చేసిందేమీ లేదు. బీజేపీ సోషల్ మీడియాలో బాగా పనిచేస్తున్నది. వారి ఓ టు బ్యాంకు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. కొత్త దవాఖానతో సర్జరీలు, కా న్పులు చేసే అవకాశం లభించనున్నది. ట్రామా కేర్ సెంటర్ ఇచ్చి సర్జన్, అనస్తీషియన్ల ను ఇవ్వాలని మంత్రి హరీశ్రావును కోరుతున్నా. బాలానగర్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందేందుకు నా పాత్ర ఉన్నందుకు గర్వంగా ఉన్నది.
డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి..
జిల్లా దవాఖానకు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయా లి. డయాలసిస్ రోగులు ఎక్కువగా ఉన్నారు. ఇతర ప్రాం తాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లాను. కోయిలకొండలో 120 ఏండ్ల నాటి దవాఖాన స్థానంలో అత్యాధునిక సీహెచ్సీని ఏర్పాటు చేసుకున్నాం. మెడికల్ పీజీ విద్యార్థులను నారాయణపేట జి ల్లా దవాఖానకు పంపిస్తే రోగులకు ఎంతో ప్రయోజనకరం గా ఉంటుంది. తండాలు గ్రామ పంచాయతీలుగా మారి అ భివృద్ధి చెందాయి. మిగిలిపోయిన తండాలకు సైతం త్వరలోనే బీటీ రోడ్లు వేస్తాం. బీజేపీ నేతలు ఏదైనా పథకం విషయంపై మాట్లాడే సందర్భం లో మా పైసలు అని అంటారని.. మరి వారికి ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పా లి. ఇతర రాష్ర్టాల్లో వ్యాట్ తగ్గించారని.. తెలంగాణలో తగ్గించాలని బీజేపీ నేతలు డి మాండ్ చేస్తున్నారు. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇంతవరకు ఎన్నడూ వ్యాట్ పెంచలేదు. కానీ కేంద్రం మాత్రం సెస్ పేరిట దోపిడీ చేస్తున్నది. ఉమ్మడి జిల్లాతోపాటు పేట నియోజకవర్గానికి సాగునీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో సాగునీరు తీసుకురావడం నా జీవితాశయం. – రాజేందర్రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే