మహబూబ్నగర్, నవంబర్ 27 : అందరికీ మంచి చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి తాను వచ్చానని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. పేదలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చి.. ప్రతి కుటుంబానికీ అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో ఎంవీఎస్ కళాశాలలో 1985-88 ఏడాదిలో డిగ్రీ చదివిన మిత్రులతో నిర్వహించిన గెట్ టు గెదర్ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లాస్మేట్లతో కలిసి నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సొంత ఊరుకు మంచి చేద్దామనే ఆలోచనతోనే హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు. ఉమ్మడి పరిపాలనలో, ఉద్యమ సమయంలోనూ తెలంగాణ ఉద్యోగులు, అధికారులపై వివక్ష కొనసాగేదని చెప్పారు. సీఎం కేసీఆర్తో కలిసి నాడు ఉద్యమంలో పాల్గొన్నట్లు చెప్పారు.
తర్వాత ప్రత్యేక రాష్ట్రం సిద్ధించడం.. ఎమ్మెల్యేగా గెలుపొందడం.. తర్వాత మంత్రిగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో తమ కుటుంబంలో సర్పంచ్ పదవిలో కూడా ఎవరూ లేరన్నారు. రాజకీయంగా ఎవరి వెన్నుదన్ను లేకపోయినా ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. మహబూబ్నగర్ ప్రజల సహకారం వల్లే సాధ్యమైందన్నారు. పాలమూరును ఎవరూ ఊహించని స్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయించి మహబూబ్నగర్తోపాటు మిగతా ప్రాంతాల్లో సాగునీరు పారిస్తామని స్పష్టం చేశారు. ఇక సాగునీటికి రైతన్నకు ఢోకా ఉండబోదని, ఆనందంగా పంటలు పండించుకోవచ్చని సూచించారు. అనాథలకు క్రీడా పాఠశాల ఏర్పాటు చేసి వారిని అత్యున్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వృద్ధులకు అండగా ఉంటామని చెప్పారు. హైదరాబాద్ నగరానికి దీటుగా పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి క్లాస్మేట్స్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ నాగరత్నమ్మ, వనపర్తి జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, నారాయణపేట ఆర్డీవో రాంచందర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణగౌడ్, రఘురాంరెడ్డి పాల్గొన్నారు.
పాలమూరును సుందరంగా తీర్చిదిద్దుతాం
మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 27 : మహబూబ్నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కొత్తచెరువు శివాలయం సమీపంలో రూ.25 లక్షలతో చేపట్టిన సీసీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వన్టౌన్ జంక్షన్ వద్ద సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలమూరు పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. జంక్షన్ల అభివృద్ధిపాటు రహదారులను విస్తరించనున్నట్లు చెప్పారు. వార్డులో పర్యటించి అవసరమున్న చోట పనులు చేపడుతామన్నారు. మిషన్ భగీరథ ప్రజల దాహార్తిని తీర్చుతున్నదని చెప్పారు. అభివృద్ధికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటిగణేశ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్ నర్సింహులు, నాయకులు శాంతయ్య పాల్గొన్నారు.