కోడేరు, జనవరి 18 : మండల కేంద్రానికి చెందిన రైతు నల్లవెల్లి వెంకటయ్య అరటి తోటసాగు చేసి అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు. మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వరి పంట సాగు చేయడంతో లాభాలు రావడం లేదని గ్రహించి.. ప్రత్యామ్నాయ సాగు వైపు దృష్టి మరల్చాడు. కోడేరు శివారులో వెంకటయ్యకు 4.20 ఎకరాలు ఉన్నది. అందులోని రెండెకరాల్లో గతేడాది నుంచి అరటి సాగు చేస్తున్నాడు. రెండెకరాలకుగానూ ఏడాదికి రూ.1.20 లక్షల పెట్టుబడి అయిందని రైతు తెలిపాడు.
450 క్వింటాళ్ల అరటి పండ్లను క్వింటాకు రూ.750 ప్రకారం మార్కెట్లో విక్రయించగా రూ.3.37 లక్షలు వచ్చింది. పెట్టుబడిపోనూ రూ.2.40 లక్షల లాభం వచ్చిందని సంతోషంగా చెబుతున్నాడు. అలాగే అంతర్ పంటగా కూరగాయలను సాగు చేయడంతో రూ.40 వేలు లాభం వచ్చింది. టమాటా, వంకాయ, మిరపకాయ, బీరకాయ, సోరకాయ వంటి కూరగాయలను సాగు చేసి ప్రతి మంగళవారం సంతలో విక్రయించినట్లు చెప్పాడు. ఈసారి కేవలం ఎకరా పొలంలో అరటి తోట సాగు చేస్తున్నాడు. మిగిలిన ఎకరాలో ఆయిల్పాం సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
గుంటూరులో శిక్షణ తీసుకున్న..
నాలుగేండ్ల కిందట అరటి తోట సాగు చేసేందుకు పాటించాల్సిన మెలకువలపై గుంటూరులో జరిగిన రైతు శిక్షణ కార్యక్రమానికి వెళ్లాను. సాగు విధానం.. అవలంబించాల్సిన పద్ధతులు తెలుసుకున్నాను. తనతోపాటు వందలాది మంది రైతులు అక్కడికి వచ్చారు. మీ ప్రాంతంలో (కోడేరు) అరటి తోటలు లేనందున సాగు చేయాలని నా గురువు మనోహర్ ఆచారి సలహా ఇచ్చారు. దీంతో అరటి తోట సాగుపై మక్కువ ఏర్పరచుకున్నాను. రెండేండ్లుగా మంచి లాభాలు పొందుతున్నాను.