అచ్చంపేట, జనవరి 18: నల్లమల కొండల్లో వెలసిన ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడో రోజు ప్రదోషకాలంలో నందివాహనంపై ఉమామహేశ్వరుల సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి నందివాహనంపై ఆలయం నుంచి పాపనాశనం వరకు ఊరేగించారు. భక్తులు జయజయ ధ్వానాలు పలుకుతూ నందివాహనసేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్యాల మధ్యన ఉమామహేశ్వర సంకీర్తన, భజన, శివనామస్మరణ చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలొచ్చి స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. ముస్లింలు కూడా స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కందూరి సుధాకర్, ఈవో శ్రీనివాసులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.