అయిజ, జూలై 3: అంతరించి పోతున్న అడవులను సంరక్షించడంతో పాటు అడవులను పెంచి పర్యావరణాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఏడు విడుతల్లో కోట్లాది మొక్కలు నాటి పెంచగా, 8వ విడుత కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. అడవులు ఉంటేనే వానలు సమృద్ధిగా కురిసి, భావి తరాల మనుగడ సాధ్యమవుతుందన్న చిత్తశుద్ధితో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏటా పండుగలా నిర్వహిస్తున్నది. ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే మొక్కలు నాటేందుకు పాదులు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించడంతో ఉపాధిహామీ పథకం కింద పనులు చేపట్టి సిద్ధంగా ఉంచారు. మండల వ్యాప్తంగా 1.12 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని నర్సరీలలో మొక్కలు పెంచారు.
మండలంలోని 28 గ్రామ పంచాయతీలలో 8వ విడుత హరితహారానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 28 నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం ఆదేశించడంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు కురవగానే హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా ప్రజలను ఆకట్టుకునే మొక్కలను నర్పరీలలో పెంచారు. పండ్లు, పూలు, గుల్మోర, అల్లనేరేడు, నిమ్మ, జామ, ఉసిరి తదితర రకాల మొక్కలు పెంచుతున్నారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీల నిర్వహణ కొనసాగుతుండగా, ఉపాధి కూలీలతో కలుపు తీయడం, నీరు పట్టడం వంటి పనులను చేయిస్తున్నారు. జిల్లా, మండల అధికారులు నిత్యం నర్సరీలను సందర్శించి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రభుత్వ, స్థలాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. స్వచ్చందంగా ముందుకు వచ్చే రైతుల పేర్లను నమోదు చేసుకుని పొలాల గట్లపై టేకు మొక్కలు అందించేందుకు చర్యలు చేపట్టారు. వానలు సమృద్ధిగా కురవగానే మొక్కలను నాటేందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారు. రోడ్లు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ స్థలాలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్ షెడ్ల వద్ద మొక్కలు విరివిగా నాటేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇండ్ల పరిసరాల్లో మొక్కలు పెంచుకునేందుకు ఇంటింటికీ 6 మొక్కలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మండలంలో 8వ విడుత హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది మండలంలో 1.12 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకనుగుణంగా ప్రణాళికలు రూ పొందించాం. ఇంటింటికీ 6 మొక్కలు పంపిణీచేసి పెంచేందుకు చర్యలు చేపడుతాం. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– సాయిప్రకాశ్ ఎంపీడీవో, అయిజ