తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు హాస్టళ్లకు వచ్చేలా చూడాలి : కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్, అక్టోబర్ 22 : వసతిగృహాల శుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల వసతిగృహాన్ని తనిఖీ చేశారు. వసతిగృహంలో శానిటేషన్, టాయిలెట్ల శుభ్రత తదితర విభాగాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ వెనకబడిన తరగతుల సంక్షేమ గృహాల తెరిచినందున వి ద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానంగా కొవిడ్ బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు వసతిగృహాలకు వచ్చేలా తల్లిదండ్రులతో మాట్లాడాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించడంతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వసతిగృహాలకు అందిన దుప్పట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఇందిరా, వసతిగృహం వార్డెన్ బందెమ్మ తదితరులు పాల్గొన్నారు.