అచ్చంపేట, నవంబర్ 17 : కేంద్ర ప్రభుత్వం దేశానికి దశా దిశ చూపించాల్సింది పోయి, సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేయడంతోపాటు బాధ్యతను విస్మరించిందని నాగర్కర్నూల్ ఎంపీ రాములు విమర్శించారు. బుధవారం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణపై కావాలని మోడీ సర్కారు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. రైతులకు తీరని నష్టం కలిగించేలా పాలన కొనసాగుతున్నదని ఆరోపించారు. దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగ సమస్య, చెప్పుకోదగిన ఏ ఒక్క పథకమైన అమలు చేయకుండా గల్లీల్లో జరిగే ఎన్నికల్లో కూడా రాజకీయం చేస్తూ ఎలా గెలువాలనే తపన తప్ప ఏమీ లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నవోదయ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రైల్వే, పెండింగ్ ప్రాజెక్టులు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ ఎన్ని వినతులు ఇచ్చినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కోసం కేంద్రంలోని మంత్రులకు వినతులు ఇచ్చినా, పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించినా స్పందన కరువైందన్నారు. రైతు చట్టాలను రద్దు చేయాలని ఆందోళనలు జరుగుతున్నా మోడీ సర్కారులో చలనం లేదన్నారు. కార్పొరేట్ సంస్థలను పెంచిపోషిస్తున్నదని ఎద్దేవా చేశారు. ఎల్ఐసీ, రైల్వే, విశాఖ స్టీల్, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా మార్పు రాకుం టే ప్రజలు క్షమించరన్నారు. ధాన్యం పూర్తిగా కొ నుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో పంటల స్థిరీకరణ, ధరలు నిర్ణయించే అధికారం కేంద్రానికే ఉన్నదని చెప్పారు. ధాన్యానికి మద్దతు ధర రూ.1965 ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పంటను కొనుగోలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నదని ప్రశ్నించారు. వానకాలంలో సాగైన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటదన్నారు. యాసంగిలో సాగు చేస్తున్న పంటను ఏ మేరకు కొనుగోలు చేస్తారో ప్రకటించాలని నిలదీశారు. కేంద్ర తీరుకు, రాష్ట్రంపై వివక్ష కారణంగానే గురువారం హైదరాబాద్లో ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమానికి హాజరుకానున్నట్లు చెప్పారు. అందరూ పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆగలేదని గుర్తు చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరి సాగైందని, దేశంలో పంజాబ్ తర్వాత అధికంగా పండించే రాష్ట్రం తెలంగాణే అన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, జెడ్పీటీసీలు మంత్రియానాయక్, ప్రతాప్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తులసీరాం, సర్పంచ్ లోక్యనాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పర్వతాలు, నాయకులు శరణ్గౌడ్, నాగయ్యగౌడ్, రమేశ్, సోమ్లానాయక్, బాల్రాజు పాల్గొన్నారు.