జడ్చర్ల టౌన్, నవంబర్ 17 : మొక్కలకు సంబంధించిన జ్ఞానాన్ని పుస్తకాలతోపాటు క్షేత్రస్థాయిలో కూడా పెంచుకోవచ్చని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ సంజప్ప అన్నారు. బుధవారం జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మొక్కల సంరక్షణపై జరిగిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. మొక్కలపై సంపాదించిన జ్ఞానాన్ని వాటి సంరక్షణకు ఉపయోగించాలని సూచించారు. వివిధ పరిశోధనా సంస్థలు అందించే ఆర్థిక సాయంతో ఆసక్తి కలిగిన వారు విద్యార్థి దశ నుంచే పరిశోధన కొనసాగించవచ్చని చెప్పారు. అంతకుముందు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల రిటైర్డ్ అధ్యాపకులు నరసింహన్ మాట్లాడుతూ విద్యార్థులు క్షేత్ర పర్యటనతో వివిధ మొక్కల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించుకోవచ్చన్నారు. మొక్కల సంరక్షణలో తమవంతు బాధ్యతను పోషించాలన్నారు. అనంతరం కళాశాల ఆవరణలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ను వారు సందర్శించారు. మొక్కల పెంపకం విధానం, వాటి ప్రాముఖ్యత గురించి గార్డెన్ సమన్వకర్త డాక్టర్ సదాశివయ్యను అడిగి తెలుసుకున్నారు. గార్డెన్లో స్వదేశీ జాతుల మొక్కలు మాత్రమే నాటుతున్నందుకు వారు అభినందించారు. ముఖ్య అతిథులుగా హాజరైన సంజప్ప, నరసింహన్ గార్డెన్లో ఔషధ మొక్కలు నాటారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ, వైస్ ప్రిన్సిపాల్ బీ.రవీందర్రావు, అధ్యాపకులు పీ.శ్రీనివాసులు, ఎన్. సుభాషిణి, లత, నందకిశోర్, భార్గవి, లత, పరిశోధక విద్యార్థులు రాము, రాజు, శివ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.