ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరిని వెల్లడించడం లేదు. యాసంగిలో వరి పండించాలో లేదో స్పష్టంగా చెప్పడం లేదు. నాట్లు వేసుకునేందుకు రోజులు దగ్గర పడుతున్న నేపథ్యంలో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తున్నది. ఇప్పటికే వానకాలంలో
పండిన వడ్లను కొనే అంశమై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోయినా తెలంగాణ సర్కార్ రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నది. కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లా నుంచి గులాబీ దండు వెళ్లనున్నది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతుబంధు సమితి అధ్యక్షులు, నాయకులు వేలాదిగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
మహబూబ్నగర్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం, రాష్ట్ర బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి పండించాలో వద్దా..? అని స్పష్టంగా చెప్పకుండా అన్నదాతను ఆగం చేస్తున్నది. ఇదే అంశంపై కేంద్ర మంత్రిని కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేసినా ఇంతవరకు ఉలుకూ పలుకూ లేదు. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం వడ్ల కొనుగోలు విషయంలో రాజకీయాలు చేస్తున్నారు. కేంద్రం వానకాలం వడ్లు కొనుగోలు చేసే అంశంలోనూ స్పష్టత ఇవ్వకపోయినా తెలంగాణ ప్రభుత్వమే ముందుకొచ్చి కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కొంటున్నది. కానీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ నేతలు కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి రాజకీయాలు చేయడమే కాకుండా దాడులకు దిగుతున్నారు. దీంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం వరి సాగు చేయమని రైతులకు చెప్తుండగా.. కేంద్రం మాత్రం తన వైఖరిని వెల్లడించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి వడ్లు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తూనే ఉంది. మరోవైపు త్వరలో యాసంగి నాట్లు వేసుకునే రోజులు దగ్గరపడుతున్న నేపథ్యంలో కేంద్రం యాసంగి వడ్ల కొనుగోలుపై స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తున్నా.. అక్కడి నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద జరిగే మహాధర్నాలో పాల్గొనేందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి అధ్యక్షులు, పార్టీ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారు. వేలాదిగా హైదరాబాద్ తరలివెళ్లనున్నారు.
బీజేపీది రెండు నాల్కల ధోరణి..
వడ్లు కొనుగోలు చేసే అంశంలో బీజేపీ వాళ్లు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారు. కొనుగోలు చేయబోమని కేంద్రం చెబుతున్నది. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం వడ్లు పండించమంటున్నారు. అలాంటప్పుడు కేంద్రాన్ని ఒప్పించి స్పష్టమైన ప్రకటన చేయిస్తే సరిపోతుంది కదా. కేంద్రాన్ని ఒప్పించాల్సిన రాష్ట్ర బీజేపీ నేతలు రైతుల వద్దకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గం, దౌర్భాగ్యమైన విషయం. బీజేపీ నేతలు రైతుల జీవితాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి రెండు నాల్కల ధోరణిని రైతులు అర్థం చేసుకోవాలి. ఎలాగైనా కేంద్రం వడ్లు కొనుగోలు చేయాల్సిందే. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి వడ్లు కొనేలా చేస్తాం. – లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల
బండి మాట వినే పరిస్థితే లేదు..
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ విధంగా, రాష్ట్రంలోని బీజేపీ మరో విధంగా వ్య వహరిస్తున్నాయి. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటుంటే.. బండి సంజ య్ అక్కడకు వెళ్లి రాజకీయాలు చేస్తున్నాడు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మాట కేంద్రంలో వినే పరిస్థితి లే కపోయినా.. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో రైతు సుభిక్షంగా ఉండి పంటలు పండించుకుంటుంటే బీజేపీ నేతలు ఓర్వలేక ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వడ్ల కొనుగోలు విషయంలో గందరగోళం సృష్టించే బదులు కేంద్రం కొంటుందో లేదే ఏదో ఒక విషయం స్పష్టం చేయాలి. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రం నుంచి లెటర్ తీసుకురావాలి. రైతులు నాట్లు వేయకముందే చెబితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అనవసరంగా రైతుల వద్దకు వెళ్లి డ్రామాలు చేయవద్దు. కేంద్రం వైఖరిని మహాధర్నాతో రైతులకు తెలియజేస్తాం.
కేంద్రం కొనుగోలు చేయాలి..
కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలు, అనాలోచిత చర్యలు ప్రస్తుత గందరగోళానికి కారణం. పంటల కొనుగోళ్లు, మద్దతు ధర, ఎగుమతులు కేంద్రం పరిధిలోని అంశం. ధాన్యం నిల్వలు పేరుకుపోయినప్పుడు కేంద్రం ఎగుమతులు చేయాలి. దానిని గాలికి వదిలేసి నిల్వలున్నాయని చెప్పి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడం దారుణం. సమైక్య పాలనలో సాగునీరు, కరెంటు లేక నష్టపోయిన రైతు.. ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీరు, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా ఇవ్వడంతో ధీమాగా వ్యవసాయం చేస్తున్నాడు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ధాన్యం కొనుగోలుకు అనుమతులు ఇవ్వాలి.
రైతులను ప్రేమించే వ్యక్తి కేసీఆర్..
రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఒకప్పుడు కరువు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరిందంటే సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం. తెలంగాణలో తమ ప్రభుత్వం లేదనే సాకుతో ఇక్కడి రైతులకు అ న్యాయం చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. మీ పరిపాలన ఉన్న కర్ణాటకలోని రాయిచూరును తెలంగాణలో కలపమని అక్కడి ఎమ్మెల్యే కోరారు. దీన్ని బట్టి మీ పరిపాలనకు.. మా పరిపాలనకు తేడా ఏంటో అర్థమవుతున్నది. వడ్లు కొనుగోలు చేయకుండా అన్నదాతను ఇ బ్బంది పెట్టొద్దు. పంజాబ్కు ఓ నీతి.. తెలంగాణకు మరో నీతి తగదు. దేశంలో అత్యధిక పన్నులు చెల్లిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. కానీ, ప్రతి విషయంలో అన్యాయమే జరుగుతున్నది. ఎఫ్సీఐ ఉన్నదే ధాన్యం కొనుగోలు చేసేందుకు. కానీ వాళ్లు ఆ పని చేయలేనప్పుడు ఎందుకున్నట్లు. దేశంలోనే రైతును అత్యధికంగా ప్రేమించే సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే. రైతులకు నష్టం జరిగితే ఊరుకోడు. ఎంతవరకైనా వెళ్తాడన్న విషయం గుర్తుంచుకోవాలి. మహాధర్నాకు పాలమూరు నుంచి 200 కార్లలో బయలుదేరుతాం. – వి.శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి
ముఖ్యమంత్రికి మద్దతుగా ధర్నాకు..
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన మహాధర్నాకు రైతులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచే 2 వేల మంది వరకు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరింత మంది రైతులు కూడా ధర్నాకు వస్తారు. వడ్లు కొనే విషయంలో బీజేపీ ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా రైతులను మోసం చేయడం తగదు. అసలు వడ్ల కొనుగోలుకు సంబంధించి కేంద్రం తన వైఖరిని వెంటనే వెల్లడించాలి. కేంద్ర ప్రభుత్వం ఒక మాట.. రాష్ట్రంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు మరో మాట చెబుతూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఎక్కడైనా రాజకీయాలు చేయండి.. కానీ రైతుల వద్ద కాదు. ఇది మహా పాపం. బీజేపీ వైఖరిని రైతులు గుర్తిస్తున్నారు. కేంద్రం వడ్లు కొనే వరకు వదిలే ప్రసక్తే లేదు.
బండి మొసలి కన్నీరు..
సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేసినా వడ్లు కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వలేదు. బీజేపీ రాష్ట్ర నేతల తీరు మరింత దారుణం. కేంద్రం, రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను అవమానిస్తున్నారు. ప్రధాని మోడీ అయినా రైతులు పండిస్తేనే తిండి అనే విషయం మర్చిపోవద్దు. అన్నదాత ఉసురు తగిలితే ఎవరికీ మంచిది కాదు. పంజాబ్, చత్తీస్గఢ్, హర్యానాలో వడ్లు కొంటూ ఒక్క తెలంగాణ మీదే సవతి తల్లి ప్రేమ చూపించడం అన్యాయం. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న 11 మంది రైతులను పొట్టనబెట్టుకున్న బీజేపీ ఎప్పటికైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. దేశంలో కేసీఆర్ లాగా రైతు సంక్షేమం కోసం ఏ ఒక్క రాష్ట్రం కృషి చేయడం లేదు. రైతులకు అండగా ఉండాల్సిన కేంద్రం వడ్లు కొనకుండా వేధిస్తున్నది. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలి. రైతులంటే బీజేపీకి చిన్నచూపు. రేపటి ధర్నాతో కేంద్రానికి గుణపాఠం చెబుతాం.
రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నది..
ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసి వడ్లు కొనాలని సీఎం కేసీఆర్ అడిగిన బృందంలో నేను కూడా ఉన్నా. రెండు రోజుల్లో వడ్ల కొనుగోలు విషయంపై స్పష్టత ఇ స్తామని హామీ ఇచ్చారు. 50 రోజులు గడిచినా ఉలుకూ పలుకూ లేదు. వానకాలం వడ్లు ఎలాగోలా కష్టపడి కొంటు న్నాం. యాసంగిలో కొనుగోలుపై కేం ద్రం నిర్ధిష్టమైన సమాధానం ఇస్తే రైతులు నాట్లు వేసుకోవాలో వద్దో నిర్ణయించుకుంటారు. స్థానిక బీజేపీ నేతలు మాత్రం నాట్లు వేసుకోమని చెప్తూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. యాసంగిలో కేంద్రం కొనుగోలు చేయకపోతే రైతులు రోడ్డున పడతారు. వారి తీరుకు నిరసనగా మహాధర్నా చేస్తున్నాం. కేంద్రం రైతుల ఉసురు పోసుకోవద్దు.