గద్వాల, నవంబర్ 11 : పేదవాడి సొంతింటి కల నిజం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నడుం బిగించి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పరుమాల శివారులో డబుల్ ఇండ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సుమారు 585 ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా, గద్వాల మండలం గోన్పాడ్లోనూ 25 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. జిల్లాకు మంజూరైనా 2,470 ఇండ్లలో తొలి విడుతగా ప్రభుత్వ స్థలం ఉన్న 11గ్రామాలతోపాటు జిల్లా కేంద్రంలో డబుల్బెడ్రూం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పూడురు, గోన్పాడ్, కొత్తపల్లి, బిజ్వారం, ఎర్సన్దొడ్డి, అరగిద్ద, రాయపురం, మల్లాపురం, కుర్తిరావులచెరువు, గట్టు ప్రాంతాల్లో ఇండ్లను ప్రభుత్వం నిర్మించనున్నది. జిల్లాలో పేద వాడి సొంతింటి కలను సాకారం చేసేందుకు తొలి అడుగు గద్వాల మండలం గోన్పాడ్ గ్రామంలో పడగా మలి అడుగు జిల్లా కేంద్రంలో పడింది. ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావస్తుండడంతో పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పెరిగిన స్టీలు, సిమెంట్ ధరలతో ఇండ్ల నిర్మాణానికి టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. నిరుపేద లబ్ధిదారులకు ఎలాగైనా ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే ఆలోచనతో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి కాంట్రాక్టర్లతో మాట్లాడి నష్టం తాను భరిస్తానని కోరడంతో గోన్పాడ్ గ్రామంతో పాటు జిల్లా కేంద్రంలో నిర్మాణాల పనులు చివరి దశకు చేరుకున్నాయి.
2,470వేల ఇండ్లు నిర్మించడమే లక్ష్యం..
జిల్లా కేంద్రం సమీపంలోని ఔటర్ రింగ్రోడ్ వద్ద 41ఎకరాల భూమిలో 1300ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడుత 585 నిర్మాణాలు ప్రారంభమై పనులు పూర్తయ్యాయి. మరో 715ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు జీప్లస్ వన్గా నిర్మిస్తున్నారు. ఒక్కో బ్లాక్లో 24ఇండ్లు అలా 24బ్లాక్లతో నిర్మాణాలు జరుగుతున్నాయి. నూతన సంవత్సరంలో లబ్ధిదారులకు ఇండ్లు అందించాలని కాంట్రక్టర్కు ఆదేశాలు జారీ చేయగా ఆదిశగా పనులు జరుగుతున్నాయి. అలంపూర్ నియోజకవర్గానికి 1,170 ఇండ్లు మంజూరు కాగా 580ఇండ్లకు టెండర్లు పూర్తయ్యాయి. త్వరలో పనులు ప్రారంభించనున్నారు.
రూ.30కోట్లతో నిర్మాణాలు..
జిల్లా కేంద్రంలో మొదటి విడుతగా 585 ఇండ్లను 10ఎకరాల్లో రూ.30కోట్లతో నిర్మిస్తున్నారు. ఒక్కో ఇంటిపై సుమారు 5.75లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తి కాగా త్వరలో కలెక్టర్ ద్వారా ప్రకటన చేయించి దరఖాస్తులు ఆహ్వానించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గోన్పాడ్లో 25డబుల్ ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇండ్లకు రంగులు కూడా వేశారు. లబ్ధిదారుల ఎంపికే మిగిలి ఉన్నది.