వరి వద్దు.. ఆరుతడి పంటలే ముద్దని ప్రభుత్వం చెబుతున్నది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయబోమని తెగేసి చెప్పడంతో రైతన్నకు సర్కార్ అండగా నిలుస్తున్నది. ఈసారికి కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామని చెప్పింది. భవిష్యత్లో కొనుగోలు సాధ్యం కాదని, అందుకే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ధాన్యం నిల్వలు బాగా పెరిగాయి. అవసరానికిమించి వరి ఉత్పత్తి కావడంతో ఇతర పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. ఆరుతడి పంటల సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడి బాగా వస్తుంది. అందుకే ఆ దిశగా రైతులకు శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
మహబూబ్నగర్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర జనాభాకు 60 నుంచి 70 లక్షల టన్నుల ధాన్యం సరిపోతుంది. ఇంత ధాన్యం ఉత్పత్తి చేయాలంటే 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే చాలు. కానీ, రెండేండ్లుగా కోటి ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వరి సాగుకు రైతులు అత్యధికంగా ఎరువులు వాడడంతో భూములు సారం కోల్పోతున్నాయి. ఫలితంగా భవిష్యత్లో వరి పండించే భూములు వ్యవసాయానికి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉన్నది. దీంతో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులను యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచిస్తున్నారు. సంప్రదాయంగా వేసుకునే ఆరుతడి పంటలు రైతులకు లాభాలను అందించడంతోపాటు భూమి సారాన్ని సైతం పెంచుతాయని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అర్చన సూచిస్తున్నారు. యాసంగిలో ఆరుతడి పంటల సాగుతో పెట్టుబడి ఖర్చులు సైతం తగ్గుతాయని చెబుతున్నారు.
ప్రస్తుత వానకాలంలో వరి సాధారణ విస్తీర్ణానికి మించి సాగైంది. ఉమ్మడి జిల్లాలో సాధారణ సాగు సుమారు 4.50 లక్షల ఎకరాలు కాగా.. నీటి లభ్యత ఘననీయంగా పెరగడంతో ఈసారి ఏకంగా 7 లక్షల ఎకరాలకు పైగా సాగు చేశారు. సాగైన విస్తీర్ణానికి తగ్గట్లుగా కనీసం 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా. యాసంగిలో పండిన పంటకు దాదాపుగా రెట్టింపు పండింది. ఇందులో రైతులు తమ సొంత అవసరాలు, విత్తనం కోసం తీసిపెట్టుకోగా.. మార్కెట్లో విక్రయించేందుకు సుమారు 16.72 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని భావిస్తున్నారు. అయితే, ఉమ్మడి జిల్లా ఆహార అవసరాలకంటే రైతులు పండించిన వరి నిల్వలు రెట్టింపునకు పైగా ఉన్నాయి. వరి దిగుబడి పెరిగిపోయి ప్రభుత్వం సైతం కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడే పరిస్థితి చేరుకున్నది. ఓ వైపు కేంద్రం వరి కొనబోమని చేతులు ఎత్తేసినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ సారికి రైతుల శ్రేయస్సు కోసం ధాన్యం కొనుగోలు చేస్తామని ముందుకొచ్చింది. అయితే భవిష్యత్లో ధాన్యం కొనుగోళ్లు సాధ్యం కాదని సర్కార్ కచ్చితంగా చెప్పేసింది. అందుకే యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేయాలని అన్నదాతలకు సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు, శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
ఆరుతడి పంటలతో ప్రయోజనాలు..