ఆత్మకూరు, నవంబర్ 10 : తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రతిరూపకంగా భావించే కురుమూర్తి స్వా మి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవానికి ఆలయం ము స్తాబైంది. గురువారం ఉద్దాల ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహించనున్నారు. మహోత్సవాలు మహబూబ్నగర్ జిల్లా లో జరుగుతున్నప్పటికీ.. వనపర్తి జిల్లా అధికారులు పూర్తి సహకా రం అందిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం సకల ఏర్పాట్లు కల్పించారు. వనపర్తి నుంచి జాతర మహోత్సవానికి వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు తదితర సౌకర్యాల కోసం అధికారులు చర్యలు చేపట్టారు. మదనాపురం, ఆత్మకూరు, అమరచింత సర్కిల్ పరిధిలో సీఐ, ఆరుగురు ఎస్సైలు.. సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ఎక్కకూడదని పోలీసులు సూచిస్తున్నారు. జాతరలో మద్య నిషేధం ఉన్నదని.. భక్తులు మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ఆత్మకూరు సీఐ రత్నం హెచ్చరించారు. మదనాపురం, ఆత్మకూరు, అమరచింత మండలాల పరిధిలో జిల్లా మద్య నిషేధ అధికారి సైదులు ఆదేశాల మేరకు ఆత్మకూరు ఆబ్కారీ ఎస్సై వాహిదుద్దీన్ ఆధ్వర్యంలో ఆబ్కారీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. జాతరకు మద్యం, నాటుసారా తరలించకుండా రూట్వాచ్లు నిర్వహిస్తున్నారు.