మహబూబ్నగర్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షంగా ఉండనున్నాయి. స్థానిక సంస్థల ఓటర్లు అయిన కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలలో అత్యధికులు టీఆర్ఎస్ పార్టీ వారే కావడంతో వార్ వన్ సైడే కానున్నదని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1,455 మంది స్థానిక సంస్థల ఓటర్లున్నారు. వీరిలో మున్సిపల్ కౌన్సిలర్లు 454, ఎక్స్ అఫీషియో సభ్యులు 19, జెడ్పీటీసీలు 82, ఎంపీటీసీలు 900 మంది ఉన్నారు. కాగా, జడ్చర్ల మండల పరిషత్ పరిధిలోని 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇక అలంపూర్ మండలంలో ఒకటి, నాగర్కర్నూల్ మండలంలో ఒక స్థానం ఖాళీగా ఉన్నది. మొత్తంగా 17 ఎంపీటీసీ స్థానాల నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు. మొత్తం 1,455 మంది ఓటర్లలో టీఆర్ఎస్ తరఫున 1049, కాంగ్రెస్ నుంచి 241, బీజేపీ నుంచి 119 మంది ఉండగా.. ఇతరులు 46 మంది ఉన్నారు. అధికార పార్టీ బలానికి సమీపంలో ఎక్కడ కూడా ప్రతిపక్షాలు సరితూగే పరిస్థితులు లేకపోవడంతో పోటీ లేకుండా ఎన్నికలు ఏకపక్షంగా ముగుస్తాయని భావిస్తున్నారు. సంఖ్యాబలం పూర్తిగా టీఆర్ఎస్ వైపే ఉండడంతో ప్రతిపక్షాలు ఈ ఎన్నికల గురించి ఆలోచించే సాహసం చేయడంలేదు. ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ప్రతిపక్షాల చడీచప్పుడు లేకపోవడంతో రాజకీయంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అధికార పార్టీ పట్టు ఏ పాటిదో చెప్పకనే చెబుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 23 మున్సిపాలిటీల్లో మక్తల్, ఆమనగల్లు మినహా మిగతా 21 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. 82 జెడ్పీటీసీల్లో 5 మినహా మిగతా 75 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఇక 14 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు టీఆర్ఎస్ పార్టీ వారే. స్థానిక సంస్థల్లో అంతా అధికార పార్టీ సభ్యులే ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం లేని ఎన్నికలుగా ఈ స్థానిక సంస్థల పోరు నిలవనున్నది. అధిష్ఠానం అభ్యర్థులుగా ఎవరిని ప్రకటిస్తారనే అంశంపైనే సర్వత్రా చర్చ కొనసాగుతున్నది.