ఊట్కూర్, నవంబర్ 7: మండల వ్యాప్తంగా వరికోతలు ముమ్మరమయ్యాయి. మరో మూడువారాల్లో వరి కోతలు పూర్తవుతాయని వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నా రు. మండలంలో గతేడాది 4500 ఎకరాల్లో సాగు చేపట్టగా ఈ ఏడాది వానకాలం సాగుకు అనుకూలంగా వానలు కురువడంతో అధికశాతం రైతులు వరిసాగుపై మక్కువ చూపారు. మండలంలోని ఊట్కూరు, కొల్లూరు, మల్లేపల్లి, తిప్రాస్పల్లి, బాపురం, నిడుగుర్తి, లక్ష్మీపల్లి, పెద్దజట్రం, అమీన్పూర్, సామనూర్, పగిడిమర్రి, ఓబ్లాపూర్ గ్రామా ల్లో అధికశాతం రైతులు వరిసాగు చేపట్టారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి 5,600ఎకరాల్లో రైతులు సాగు చేపట్టారు. ప్రధానంగా ఆయా మండలాల్లో వరి బీపీటీ, 1010రకం, ఆర్ఎన్ఆర్ (తెలంగాణ సోనా) సాగు చేశారు. పంటకు సుడిదోమ, కాండం కుళ్లు తెగులు సోకినప్పటికీ రైతులు సకాలంలో వ్యవసాయ నిపుణుల సలహాలు, సూచనలు పాటించి నివారణ చర్యలు చేపట్టారు. దీంతో పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. కాగా మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి వరి కంకులు నేలరాలి రైతులను ఆందోళనకు గురిచేసింది. ఎకరాకు 30నుంచి 40 బస్తాలు పండే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. మరో పక్క వానకాలంలో సాగైన పంటలు ఒకేసారి చేతికి అందడంతో రైతులకు కూలీల కొరత వేధిస్తున్నది. వసతులను బట్టి ఆయా గ్రామాల్లో రైతులు వరికోత మిషన్లు, కూలీల సాయంతో కోతలు కోయిస్తున్నారు. హార్వెస్టార్కు గంటకు రూ. 2800 చెల్లిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఒక్కో కూలీకి రూ. 300 చెల్లించి కోత పనులు చేపడుతున్నామని రైతులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మాదిరిగానే రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించేందుకు అన్ని మండలకేంద్రాలలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టిం ది. రెండు రోజుల కిందట నియోజకవర్గంలోని నర్వ మండలకేంద్రంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, ధాన్యాన్ని సంబంధిత కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచనలు చేశారు. వరికి మద్దతు ధర దక్కే విధంగా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటంతో అన్నదాతలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వారంరోజుల్లో మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తాం. వరికి ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాకు రూ.1960 చెల్లించి కొనుగోలు చేస్తుంది. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. ఈ అవకాశాన్ని అన్ని గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించాం.