చనిపోతే ఆరడుగుల జాగలేని దుస్థితి..ఎక్కడ ఖననం చేయాలో తెలియని పరిస్థితి..వర్షం కురిస్తే దారి లేక మధ్యలోనే తంతు నిలిపివేసిన సంఘటనలు ఎన్నో చూసుంటాం..చివరి మజిలీ ప్రశాంతంగా..సజావుగా సాగాలని ప్రభుత్వం వైకుంఠధామాలు నిర్మిస్తున్నది. ఏదో కట్టి వదిలేశామన్నట్లు కాకుండా సకల సౌకర్యాలతో చివరి ప్రస్థానం ముగిసేలా ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామ పంచాయతీలో అన్ని వర్గాల కోసం రూ.10లక్షలతో వైకుంఠధామాలు నిర్మించి ఖననం కష్టం లేకుండా చేసింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 255 పంచాయతీలకుగానూ వందశాతం లక్ష్యం నెరవేరింది.
గద్వాల, నవంబర్ 7 : పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పచ్చదనం కోసం నర్సరీల ఏర్పాటు, పరిశుభ్రత కోసం ట్రాక్టర్, చెత్తను డంప్ చేసేందుకు డంపింగ్యార్డులు, చివరి మజిలీ ప్రశాంతంగా ఉండేలా వైకుంఠధామాల ఏర్పాటు.. ఇలా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో సకల సౌకర్యాలు కల్పించింది. గ్రామాల్లో ఎవరైనా చనిపోతే ఖననం చేసేందుకు చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఒక్కోసారి ఖననం అంటే కంటి మీద కునుకు లేకుండా చేసే పరిస్థితి ఉండేది. అయితే, తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో అన్ని వర్గాల కోసం రూ.10 లక్షలతో వైకుంఠధామాలు నిర్మించింది. వైకుంఠధామాల్లో రెండు దహనవాటికలు నిర్మిస్తున్నారు. దీంతో పాటు స్నానాలు చేయడానికి, బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు, టాయిలె ట్స్, కార్యాలయ గది, బోరు మోటారు ఏర్పాటు చేశారు. వై కుంఠధామం ఆవరణలో మొక్కలు నాటడంతోపాటు కూ ర్చోవడానికి బెంచీలు వేశారు. కర్మకాండల నిర్వహణకు ప్ర త్యేక షెడ్డు నిర్మించారు. ప్రతి వైకుంఠధామంలో శివుడి వి గ్రహం, కాంపౌండ్ వాలు, విద్యుత్ సౌకర్యం, గేటు ఏర్పా టు చేశారు. మృతదేహాన్ని వైకుంఠధామానికి తీసుకెళ్తే అన్నీ అక్కడే పూర్తి చేసేలా ప్రభుత్వం సౌకర్యాలు కల్పించింది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. డీఆర్డీవో ఆధ్వర్యంలో 36, పీఆర్ ఈఈ ఆధ్వర్యంలో 219 వైకుంఠధామాల పనులు చేపట్టారు. అన్ని వై కుంఠధామాల పనులు పూర్తయ్యాయి. ఇందులో కొన్ని ప్రా రంభించారు. జిల్లాలో వంద శాతం వైకుంఠధామాలు పూర్తి కావడంతోపాటు ప్రభుత్వం ముందుచూపుతో సకల సౌకర్యాలు కల్పించడంతో పల్లె జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వంద శాతం పూర్తి..
జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల పనులు పూర్తి చేశాం. చివరి మజిలీ ప్రశాంతంగా కొనసాగేలా సకల సౌకర్యాలు కల్పించాం. గతంలో ఎవరైనా చనిపోతే ఖననం కష్టంగా ఉండేది. ప్రభుత్వ నిర్ణయంతో ఆ సమస్య తీరింది. జిల్లాలో అన్ని పంచాయతీల్లో నిర్మాణాలు పూర్తి చేయడం సంతోషంగా ఉంది.
సమస్య తీరింది..
గతంలో గ్రామంలో ఎవరైనా చనిపోతే ఖననం చేయాలంటే ఇబ్బందులు పడేవాళ్లం. ప్రభుత్వం పల్లెప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటు చేయడంతో సమస్య తీరింది. మా గ్రామంలో ఊరు సమీపంలో అన్ని సౌకర్యాలతో వైకుంఠధామం ఏర్పాటు చేశారు. అందులో శివుడి విగ్రహం ఉన్నది.