రాష్ట్రంలో ప్రభుత్వ బడుల తర‘గతి’ మారిపోయింది. విశాలమైన గదులు, విద్యార్థులు అనువుగా
కూర్చొనేందుకు అవసరమైన డెస్కులు, అక్షరాలు ముత్యాల్లా మెరిసే బోర్డులు.. హైక్లాస్ సౌకర్యాలతో
రూపుదిద్దుకున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలోని చింతలపల్లి రైలుబడి, వినూత్నంగా కృత్యాధార బోధనలో బెక్కెర పాఠశాల, పూర్వ విద్యార్థుల చేయూతతో అభివృద్ధి బాటలో వంగూరు పాఠశాల ప్రత్యేకం. తెలంగాణ వచ్చాక రూపురేఖలే మారిపోయాయి. వీటి గురించి ప్రత్యేక కథనాలు మ్యాగజైన్లో ప్రచురితం కావడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సర్కారు ప్రోత్సాహానికి అధికారుల సహకారం,ఉపాధ్యాయుల అభిరుచితో పాటు సమాజ చేయూత తోడవుతున్నది. కార్పొరేట్ స్థాయిలో విద్య బోధన ఉండడంతో విద్యార్థులు ఇక్కడ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు.
వినూత్న బోధనలో బెక్కెర స్కూల్
కల్వకుర్తి మండలంలోని బెక్కెర మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కృత్యాధార బోధనతో విద్యార్థులకు చక్కటి విద్య అందిస్తున్నది. ఇక్కడి బోధన నచ్చడంతో దాతల సహకారంతో రూ.6 లక్షలతో మౌలిక వసతుల కల్పన పెరిగింది. కృత్యాధార పద్ధతిలో అంటే ఆటలు, పాటల ద్వారా బోధన జరిపిస్తున్నారు. విద్యార్థులకు విన్నదానికన్నా చూస్తూ చేతలతో నేర్చుకుంటే 80 శాతం వరకు మనస్సులో నిలిచిపోతుంది. దీంతో కృత్యాధార బోధన పద్ధతి విద్యార్థులను ఆకట్టుకుంటోంది. అలాగే ప్రొజెక్టర్ టీవీ పాఠాలు, కంప్యూటర్ ద్వారా సాంకేతిక విద్యను సైతం అందిస్తుండటం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం చదువులో ముందుండే విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థి ఆంగ్లంలో మాట్లాడేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే ప్రతిరోజూ విద్యార్థులకు అల్పాహారం అందజేస్తుండటం విశేషం. ఇక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోడలపై ప్రత్యేకంగా చిత్రాలను గీసి పాఠశాలను ఆహ్లాదకరంగా మార్చారు. ఇలాంటి కృత్యాధార బోధన పద్ధతిలో బెక్కెర పాఠశాలలో జరుగుతున్న విద్యా బోధన సైతం ఎస్సీఈఆర్టీ పుస్తకంలో ప్రచురించింది. ఈ అంశం కూడా పాఠశాలకు జాతీయ స్థాయి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చింది.
శిథిలావస్థ నుంచి ఆధునిక వసతుల దాకా..
వంగూరు మండలంలోని బాలుర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆ పాఠశాలకు పూర్వ విద్యార్థి. 2018లో హెచ్ఎంగా బదిలీపై వచ్చిన శశాంక్రెడ్డి ఇక్కడికి వచ్చేటప్పటికే శిథిలావస్థలో ఉంది. ఎప్పుడు కూలిపోతుందోనన్న అధ్వాన్న స్థితికి చేరుకొంది. దీంతో తాను చదువుతున్న పాఠశాలకు హెచ్ఎంగా విధులు నిర్వహిస్తూ మంచి బోధన జరిపించడం ఒక అంశంగా ఎం చుకున్న ఆయన పాఠశాలను ఆధునికంగా మార్చాలని తలంచారు. తనతో పాటు చదువుకున్న పూర్వ విద్యార్థులకు పాఠశాల దుస్థితిని వివరించారు. స్పందించిన పూర్వ విద్యార్థులు ఏకంగా రూ.11 లక్షల విరాళం అందించారు. ఈ డబ్బులతో పాఠశాల పై కప్పును తొలగించి నూతన స్లాబ్ వేయించి ఐదు నెలల్లోనే పాఠశాల రూపురేఖలను మార్చేలా చేయించారు. ఇలా కొద్ది నెలల్లోనే శిథిలావస్థ నుంచి ఆధునిక హంగులను తలపించేలా పాఠశాల మారింది. కంప్యూటర్ గదులు, గ్రంథాలయం నిర్మించారు. పాఠశాల గదులను సైతం విద్యార్థులకు చదువును నేర్పించేలా మంచి బొమ్మలను వేయించారు. పాఠశాల ఆవరణ సైతం రంగులతో, బొమ్మలతో ఆకట్టుకుంటుంది. ఇది తల్లిదండ్రుల్లో పాఠశాలపై నమ్మకం కల్పించింది. దీంతో ఇంతకు ముందు 30మంది విద్యార్థులున్న ఈ పాఠశాల 80 మంది విద్యార్థులకు చేరుకొంది. ఇలా ప్రత్యేకంగా నిలిచిన పాఠశాలను సైతం ఎస్సీఈఆర్టీ తన సంచికలో ప్రచురించడం జరిగింది. ఈ పాఠశాల సైతం జిల్లా పేరును జాతీయ స్థాయిలో ప్రముఖంగా చర్చించేలా మార్చింది.
చాలా సంతోషంగా ఉంది..
మా రైలుబడి పాఠశాలకు ఎస్సీఈఆర్టీ గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచేందుకు మేం చేస్తున్న కృషికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, గ్రామస్తులు కూడా సహకరించారు. విద్యార్థులను బడికి ఆకర్షించేలా రైలులా రంగులతో తీర్చిదిద్దాం. పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా పాఠశాల గదులను కంప్యూటర్, సైన్స్, గణితం, ఇంగ్లిష్లోని ముఖ్య అంశాలతో బొమ్మలు వేయించాం.