ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. ఇందుకోసం తీసుకున్న చర్యలతో ఉమ్మడి జిల్లాలోని
సర్కారు దవాఖానల్లో సూపర్ స్పెషాలిటీ సేవలందుతున్నాయి. ఆధునిక సౌకర్యాలు, వసతులతోపాటు అత్యాధునిక పరికరాలు, వివిధ రకాల పరీక్షల కోసం అధునాతన ల్యాబ్లు, 24 గంటలు వైద్యులు, సిబ్బంది అందుబాటులోకి వచ్చారు. దీంతో నమ్మకంతో ప్రజలు వైద్యశాలలకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్లో మెడికల్ కాలేజీ కొనసాగుతుండగా.. కొత్తగా వనపర్తి, నాగర్కర్నూల్కు మంజూరయ్యాయి. అలాగే నాలుగు జిల్లాలకు నర్సింగ్ కాలేజీలు కూడా మంజూరయ్యాయి. ఇవన్నీ పూర్తయితే మరిన్ని వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లాలో వైద్య సదుపాయాల కల్పనలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి చేస్తున్న కృషిని ప్రజలు హర్షిస్తున్నారు.
మహబూబ్నగర్, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమైక్య రాష్ట్రంలో పడ్డ గోసకు ఫుల్ స్టాప్ పలుకుతూ సూపర్ స్పెషాలిటీ వైద్యం మరింత చేరువ అవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అంతంత మాత్రంగా కొనసాగుతూ వస్తున్న వైద్య సదుపాయాల సామర్థ్యాలను పెంచుకుంటూ ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఏకైక ప్రభుత్వ మెడికల్ కళాశాల తెలంగాణ ఏర్పాటు తర్వాత మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ మెడికల్ కళాశాల పరిధిలో ఉన్న ప్రభుత్వ జనరల్ దవాఖాన ద్వారా ఉమ్మడి జిల్లా మొత్తానికి అధునాతన వైద్య సేవలు అందుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించిందీ దవాఖానే. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో కేవలం ఒకే ఒక ప్రభుత్వ కళాశాల మాత్రమే ఉండగా..ఈ ఏడాదే కొత్తగా వనపర్తి, నాగర్కర్నూల్కు మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయి. ఈ రెండు మెడికల్ కళాశాలల వల్ల ఉమ్మడి జిల్లాలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడింది. వైద్య కళాశాలతోపాటు నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్కు రీజినల్ సబ్ సెంటర్లు సైతం మంజూరు చేశారు. రీజినల్ సబ్ సెంటర్ల ఏర్పాటుతో వాటి పరిధిలోని వివిధ ప్రభుత్వ దవాఖానలకు యుద్ధప్రాతిపదికన మందులు అందించడానికి చక్కని అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి మెడికల్ కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు సైతం మంజూరయ్యాయి. ఇక జోగుళాంబ గద్వాల కేంద్రంలో నూతనంగా మంజూరైన నర్సింగ్ కళాశాల కోసం ప్రైవేటు బిల్డింగ్లో ఏర్పాటు కూడా చేశారు. ఉమ్మడి జిల్లాలో వైద్య సదుపాయాల కల్పనలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంత్రులు వి. శ్రీనివాస్గౌడ్, ఎస్. నిరంజన్రెడ్డి చేస్తున్న కృషిని ప్రజలు హర్షిస్తున్నారు.
పెరగనున్న పడకలు, వైద్య సేవలు..
మెడికల్ కళాశాల వస్తే.. 650 పడకలు 150మంది వైద్యులు అందుబాటులోకి ఉంటారు. అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందుతాయి. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండగా…కొత్తగా రెండు మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయి. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తుండగా… జోగుళాంబ గద్వాల జిల్లాలో నర్సింగ్ కళాశాల ప్రారంభమైంది. వనపర్తిలో మెడికల్, నర్సింగ్ కళాశాలల పనులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖాన మహబూబ్నగర్తో పాటు నారాయణపేట జిల్లాల ప్రజలకు పూర్తిగా… నాగర్కర్నూల్, వనపర్తి జిల్లా, జోగుళాంబ గద్వాల జిల్లాల పరిధిలోని వారికి కొంతమేర అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు వనపర్తిలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాల వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రజలకు సేవలు అందించనున్నది. ఇక నాగర్కర్నూల్లో మెడికల్ కళాశాల వల్ల ఎంతో కాలంగా వైద్యానికి అవస్థలు పడుతున్న నల్లమల చెంచులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న జిల్లా దవాఖానలు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే జనరల్ దవాఖానలుగా మారుతాయి. కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఈఎన్టీ, గైనిక్, అనస్తీషియా, రేడియాలజీ, జనరల్ సర్జరీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, సైకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ వంటి విభాగాలు అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్, కర్నూలు వెళ్లి వైద్యం చేయించుకునే దుస్థితి స్థానికులకు తప్పుతుంది.
ఊహించని విధంగా మార్పులు..
మహబూబ్ నగర్ మెడికల్ కళాశాలకు ఊహించని విధంగా ప్రారంభమైన మూడేండ్లలోనే పీజీ సీట్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ విభాగాల్లో మొత్తం కలిపి 20 సీట్లున్నాయి. త్వరలో గైనకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ లోనూ పీజీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఓ మెడికల్ కళాశాల ప్రారంభమైన 10 ఏండ్ల తర్వాత కూడా పీజీ సీట్లు ప్రారంభం కాని కాలేజీలున్న పరిస్థితుల్లో మహబూబ్ నగర్ లో మాత్రం కళాశాల ప్రారంభం అయిన మూడేండ్లకే పీజీ సీట్లు రావడం విశేషం. ఇక మహబూబ్ నగర్ మెడికల్ కళాశాలకు అనుబంధంగా పారామెడికల్ కళాశాల కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ డీఎంఎల్టీ 30 సీట్లు, డయాలసిస్ టెక్నీషియన్ 10 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో ఏకైక ఆదర్శ గ్రామీణ ఆరోగ్య పరిశోధనా కేంద్రం కూడా మహబూబ్నగర్ జిల్లా జానంపేటలో ప్రారంభం కానున్నది. దీనివల్ల స్థానిక రోగాలపై పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుంది. త్వరలో కార్యాలయం పనులు కూడా మొదలుకానున్నాయి.
వైద్యుల సంఖ్య పెరిగింది
మెడికల్ కళాశాల వల్ల చాలా మార్పు వచ్చింది. గతంలో 30 మందిలోపు డాక్టర్లు ఉండేవారు. ఇప్పుడు 150 మంది ఉన్నారు. హౌస్ సర్జన్లు 150 మంది ఉన్నారు. మొత్తం 300 మంది వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక నర్సులు 300మంది ఉంటారు. ఒకప్పుడు చిన్న చిన్న సర్జరీ కోసం కూడా హైదరాబాద్ పోవాల్సి వచ్చేది. ఇప్పుడు స్థానికంగానే అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నాం. నాగర్కర్నూల్, వనపర్తి మెడికల్ కళాశాలలు కూడా ప్రారంభమైతే ఉమ్మడి జిల్లాలో అంతా కలిపి సుమారు 2వేల పడకల అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.