ముంబై, ఏప్రిల్ 30: కేంద్రంలో ఎవరు అధికారం చేపట్టాలనేది నిర్ణయించడంలో మహారాష్ట్రది కీలకపాత్ర. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నది ఇక్కడే. 48 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈసారి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. శివసేన ఇప్పుడు ఉద్ధవ్ వర్గంగా, షిండే వర్గంగా చీలిపోయింది. ఎన్సీపీ శరద పవార్ వర్గంగా, అజిత్ పవార్ వర్గంగా విడిపోయింది. కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) కలిసి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)గా పోటీ చేస్తున్నాయి. బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) కలిసి మహాయుతి కూటమిగా ఏర్పడ్డాయి. దీంతో ఈసారి రాష్ట్రంలో రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలో పాగా వేసేందుకు రెండు కూటములు శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నాయి.
పశ్చిమ మహారాష్ట్రలో పుణె, మావల్, శిరూర్, బారామతి, షోలాపూర్, మధ, సతారా, సంగ్లి, కొల్హాపూర్, హట్కనంగలె లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతం గతంలో ఎన్సీపీ, కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది. 2019లో ఎన్సీపీ 3, బీజేపీ 4, శివసేన 3 సీట్లు గెలిచాయి. మొత్తం మహారాష్ట్రలో ఎంవీఏ ఈ ప్రాంతంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నది.
పశ్చిమ మహారాష్ట్రలో చెరుకు రైతులు ఎక్కువ. ఈ ప్రాంతాన్ని షుగర్ బెల్ట్ అని పిలుస్తారు. రైతు సహకార సంఘాల ప్రభావం ఈ ప్రాంతంలో ఎక్కువ. వీటిల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు మంచి పట్టు ఉంది. ఈసారి తన పార్టీలోనే చీలిక రావడంతో పవార్కు కఠిన పరీక్ష ఎదురవుతున్నది. దీంతో కచ్చితంగా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని పవార్ పట్టుదలగా ఉన్నారు.
బీజేపీకి మహారాష్ట్రలో ప్రతి సీటూ కీలకంగా మారింది. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలోని 10 స్థానాల్లో మెజారిటీ గెలుచుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అజిత్ పవార్ ద్వారా ఎన్సీపీ బలాన్ని తగ్గించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. అయితే, ఈ ప్రాంతంలో ఎన్సీపీ(శరద్ పవార్), కాంగ్రెస్ ఇప్పటికీ బలంగా ఉండటం, శివసేన(ఉద్ధవ్) కూడా కొన్ని చోట్ల బలంగా ఉండటం బీజేపీకి సవాల్గా మారింది.