సారంగాపూర్, మార్చి 28: కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కొంతమంది సీనియర్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తప్పుదోవ పట్టించారని, రైతులకు నీటి కష్టాలు తెచ్చిన పాపం వారిదేనని ఆయన మండిపడ్డారు. గురువారం సాయంత్రం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోతారంలో ఎండిన పొలాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ను పునరుద్ధరించాలని, మేడిగడ్డ పిల్లర్లను బాగుచేసి సాగునీరందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ను విమర్శించడంమాని రైతులకు న్యాయం చేసేలా చర్య లు చేపట్టాలని సూచించారు. జగిత్యాల నియోజకవర్గంలో రైతులకు నష్టం జరుగుతున్నా, ఇక్కడి సీనియర్ నాయకులు ఎందుకు స్పందించడం లేదో? చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎస్సారెస్పీ పరిధిలో ఉన్న జగిత్యాల నియోజకవర్గంలో ఆయకట్టు పెరగడంతో 30 ఏండ్ల కిందటి నుంచే సాగు నీటి సమస్యలు వచ్చినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. కానీ బీఆర్ఎస్ సర్కారు కాళేశ్వరం ద్వారా నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టిందని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు తీరుతో పంటలన్నీ ఎండిపోతున్నాయని అన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్-1లోనే నీటి కొరత ఉంటే, మిగతా ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎస్సారెస్పీలో ఈ ప్రాంతానికి హక్కుగా రావాల్సిన నీటిని సూర్యాపేటకు తరలించుకుపోతున్నారని, అందుకే ఇక్కడ నీటి సమస్య ఏర్పడిందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు నష్టపోకుండా మరో తడికి నీటిని విడుదల చేయాలని కోరారు.