భోపాల్: మధ్యప్రదేశ్లో పట్వారీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో చోటుచేసుకున్న భారీ అక్రమాలపై దుమారం రేగుతున్నది. కొన్నేండ్ల కిందట మహారాష్ర్టను కుదిపేసిన వ్యాపమ్ స్కామ్తో దీన్ని పోల్చుతున్నారు. మధ్యప్రదేశ్ ఎంప్లాయీ సెలెక్షన్ బోర్డు ఏప్రిల్ 26న ఈ పరీక్ష నిర్వహించగా, మే, జూన్లలో ఫలితాలు ప్రకటించారు. టాప్-10 ర్యాంకర్లలో ఏడుగురు ఒకే ఎగ్జామ్ సెంటర్కు హాజరైనట్టు తేలడంతో వివాదం రేగింది. ఆ పరీక్షా కేంద్రం బీజేపీ ఎమ్మెల్యేకు చెందినది కావడం గమనార్హం.
ఏడుగురు టాపర్లలో పూనమ్ రాజ్పుత్ ఒకరు. ఆమెకు థర్డ్ ర్యాంక్ వచ్చింది. అయితే పరీక్షకు సంబంధించిన సబ్జెక్ట్ల పేర్లను కూడా ఆమె చెప్పలేకపోవడం గమనార్హం. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మూడేండ్లుగా పరీక్షకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. తొలుత ఆన్లైన్ కోచింగ్ తీసుకుని, తర్వాత ఆఫ్లైన్ క్లాస్లకు హాజరైనట్టు తెలిపారు. పట్వారీ పరీక్షకు సంబంధించిన సబ్జెక్టుల గురించి ప్రశ్నించగా.. ఎనిమిది సబ్జెక్టుల పేర్లను కూడా ఆమె చెప్పలేకపోయింది. అలాగే కఠినమైన ప్రశ్నలకు కరెక్టుగా సమాధానం రాసి, సులభమైన ప్రశ్నలకు తప్పుగా సమాధానం రాయడంపై ప్రశ్నించగా ఆమె సమాధానమివ్వలేదు. బ్యాంకులు, ఎస్ఎస్సీ ఎంటీఎస్ వంటి పోటీ పరీక్షలకు కూడా తాను హాజరైనట్టు చెప్పిన పూనమ్.. ఎస్ఎస్సీ ఎంటీఎస్ పరీక్షలో తాను సెలెక్ట్ కాలేదని తెలిపారు.