మూసాపేట, ఏప్రిల్ 18 : మండలంలోని నిజాలాపూర్లో ఓ పిచ్చికుక్క నలుగురిపై దాడి చేయగా పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా దవాఖానకు తరలించిన ఘటన గురువారం చోటు చేసుకున్నది. వివరాలల్లోకి వెళ్తే.. గ్రామంలోని పాఠశాల వద్ద ఉన్న మూడేండ్ల అభినంద్, భానుప్రకాశ్(9) మానస అనే బాలికపై పిచ్చి కుక్క ఎగబడి విచక్షణా రహితంగా కరుస్తున్న సమయంలో అటువైపు వచ్చిన పల్లెమోని నాగన్న ఆ పిచ్చి కుక్కను బెదిరించి పిల్లలను కాపాడేందుకు వెళ్లాడు. దీంతో పిల్లలను వదిలి కుక్క దూరంగా వెళ్లింది. తిరిగివస్తున్న నాగన్నపై వెనుకవైపు నుంచి దాడి చేసి భుజం, చేతులపై కరిచింది. చెయ్యిపట్టుకొని వదలక పోవడంతో స్థానికులు కుక్క నోట్లో కట్టెపెట్టి చెయ్యిని బయటకు తీశారు. మళ్లీ ఇతరులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో ఆ కుక్కను కొట్టి చంపారు. గాయాలైన ముగ్గురు చిన్నారులను జానంపేట దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ షబానాబేగం జిల్లా దవాఖానకు రెఫర్ చేశారు. అయితే పిల్లలను కాపాడిన నాగన్న దవాఖానకు ఆలస్యంగా వచ్చాడు. దీంతో అతడి పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యురాలు వెంటనే 108లో జిల్లా దవాఖానకు తరలించారు.