తిమ్మాపూర్: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్ఎండీ రిజర్వాయర్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టాన్ని పరిశీలించిన అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం దిగువ మానేరు జలాశయం నుంచి ఎనిమిది గేట్ల ద్వారా 24వేల క్యూసెక్కుల నీటిని ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్ స్విచ్ ఆన్ చేసి దిగువకు విడుదల చేశారు. గత నెలలో కురిసిన వర్షాలు, మిడ్ మానేరు నుంచి భారీగా ఇన్ఫ్లో రావడంతో గత నెల 22న మంత్రి గంగుల కమలాకర్ ఈ సీజన్లో మొదటి సారి 12 గేట్లు ఎత్తి 60వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. అనంతరం జూలై 28న ఎల్ఎండి రిజర్వాయర్కు ఇన్ఫ్లో పెరగడంతో రెండోసారి రెండు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు.
కాగా ప్రస్తుతం గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మోయతుమ్మెద వాగు నుంచి 60,716 క్యూసెక్కులు, ఇతర క్యాచ్మెంట్ ఏరియా నుంచి 1200 క్యూసెక్కులు.. మొత్తం 61,916 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రస్తుతం ఎల్ఎండీ రిజర్వాయర్లో 24.034 టీఎంసీలకు 23.171 టీఎంసీల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రిజర్వాయర్లోకి 61,916 క్యూసెక్కులు ఇన్ఫ్లో రూపంలో రాగా గేట్ల ద్వారా 24వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 300 క్యూసెక్కులు.. మొత్తంగా 27,300 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎగువ నుంచి ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తివేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ నాగభూషణం, ఎఈ వంశీ, సిబ్బంది పాల్గొన్నారు.