సిటీబ్యూరో/మేడ్చల్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శనివారం లాటరీ విధానంలో దుకాణాల కేటాయిం పు ఇవ్వనున్నారు. అంబర్పేట్ ఛే నంబర్ చౌరస్తాలోని రాణా ప్రతాప్సింగ్ ఫంక్షన్ ప్యాలెస్లో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఉదయం 11 గంటలకు దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీలు తీయనున్నారు. దుకాణం దక్కించుకున్న వాళ్లకు రెండేండ్లపాటు లైసెన్స్ అమలులో ఉంటుంది.
భారీ స్పందన
హైదరాబాద్ జిల్లాలో 179 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ..ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేయగా, 18వ తేదీ వరకు దరఖాస్తుల సమర్పణకు గుడువు విధించారు. ఇందులో 24 దుకాణాలను గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లో కేటాయించారు. 2019లో 1,623 దరఖాస్తులుగా రాగా, ఈ ఏడాది 3,546లు వచ్చాయి. గతం కంటే ఈసారి హైదరాబాద్ (1,770), సికింద్రాబాద్ (1,776) రెండింతల దరఖాస్తులు అందాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఇక్కడే భారీగా అర్జీలు రాగా, సుమారు రూ. 71 కోట్ల ఆదాయం వచ్చింది.
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో..
మేడ్చల్ జిల్లాలో 202 మద్యం దుకాణాలకు 6,272 దరఖాస్తులు రాగా, వాటి ద్వారా రూ. 125 కోట్ల 44 లక్షల ఆదాయం లభించింది. బాలానగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్లో 114 దుకాణాలకు 3,609.. మల్కాజిగిరి, ఉప్పల్, ఘట్కేసర్లో 88 దుకాణాలకు 2,663 దరఖాస్తులు వచ్చాయి. గతంలో జిల్లాలో 3,343 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, ప్రస్తుతం 6,272లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కొంపల్లి కన్వెన్షన్లో లాటరీ తీయనున్నట్లు చెప్పారు. కాగా, రంగారెడ్డి జిల్లాలో 8,239 దరఖాస్తులు వచ్చాయి.