భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
ఆర్జ్జిత సేవల ద్వారా రూ.17,17,385 ఆదాయం
సంక్రాంతి అనంతరం వచ్చే మొదటి ఆదివారం రోజున పట్నం వారంతో తిరిగి ఉత్సవాలు ప్రారంభం
చేర్యాల, డిసెంబర్ 27 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం లక్ష బిల్వార్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కల్యాణం మరుసటి రోజు ఆలయ సంప్రదాయం మేరకు లక్ష బిల్వార్చన పూజలు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనువంశిక వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం స్వామి ఆలయంలో స్వస్తిక్ పుణ్యహావచనం, గణపతి పూజ, పంచచార్య పూజలు, రుద్రాభిషేకం, బిల్వార్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, హారతి, మంత్రపుష్పం, మహా నైవేద్యం తదితర పూజలు అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. లక్ష బిల్వాలను(మారేడు) స్వామి మూలవిరాట్కు సమర్పించారు. 1008 మల్లన్న నామస్మరణలు పఠిస్తూ బిల్వార్చన కొనసాగించారు. పూజల్లో ఆలయ అర్చకులు మల్లికార్జున్ దంపతులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఎ.బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, పర్యవేక్షకుడు నీల శేఖర్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ డైరెక్టర్లు బొంగు నాగిరెడ్డి, చింతల పరుశరాములు, కొంగరి గిరిధర్, పోతుగంటి కొంరెల్లి, తాళ్లపల్లి శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.
ముగిసిన వేడుకలు..
రెండు రోజుల పాటు మల్లన్న స్వామి కల్యాణోత్సవ వేడుకలు నిర్వహించిన ఆలయ అర్చకు లు.. లక్ష బిల్వార్చన, మహాన్యాస పూర్వక పూజలతో కల్యాణ వేడుకలు ముగిసినట్లు ప్రకటించారు. సంక్రాంతి అనంతరం వచ్చే మొదటి ఆదివారం రోజున పట్నం వారంతో తిరిగి ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మొదటి ఆదివారం పట్నం వారం సందర్భంగా హైదరాబాద్ భక్తులు పట్నం, అగ్నిగుండాలు నిర్వహించుకుంటారని తెలిపారు. మొదటి వారానికి సుమారు లక్ష మంది భక్తులు కొమురవెల్లికి తరలివచ్చే అవకాశం ఉంటుందన్నారు. కల్యాణోత్సవ వేడుకలు విజయవంతంగా ముగియడంతో చైర్మన్, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బందిని ఈవో ఆధ్వర్యంలో అర్చకులు ఘనంగా సన్మానించారు. అంతకు ముందు పూజల్లో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆర్జిత సేవల ఆదాయం రూ. 17,17,385
కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం సందర్భంగా భారీగా భక్తులు తరలిరావడంతో బుకింగ్ ఆదాయం పెరిగిందని ఆలయ చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. పట్నాల ద్వారా రూ.3,61,720, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.6,60,000, ప్రసాదాల విక్రయంతో రూ.6,11,220, భక్తుల కట్నాల ద్వారా రూ.84,405 స్వామి ఖజానాకు సమకూరినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఇదే సంవత్సరం జనవరి 10న జరిగిన కల్యాణోత్సవం సందర్భంగా రూ.11,46,535 ఆదాయం వచ్చిందన్నారు.