AP Ministers : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ను చూస్తే తుగ్లక్ పాలన గుర్తుకొస్తోందని పార్థసారథి వ్యాఖ్యానించారు. విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని అన్నారు. మంగళగిరిలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. తుగ్లక్ పేరు వినడమే తప్ప చూడలేదని, కానీ జగన్ను చూస్తే ఆయనే గుర్తుకొస్తున్నారని చెప్పారు.
మూడు రాజధానుల పేరుతో ఆయన మూడు ముక్కలాట ఆడారని పార్థసారథి విమర్శించారు. తాను చెప్పిందే అందరూ వినాలనే ధోరణివల్లే ప్రజలు ఎన్నికల్లో తగిన తీర్పు ఇచ్చారని మండిపడ్డారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రైతులు రాజధానికి భూములు ఇచ్చారని, అలాంటి రైతులను అవమానించిన వైసీపీకి భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. మరోవైపు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తెలుగు జాతిపైన, అమరావతిపైన జగన్కు ఎందుకంత కక్ష..? అని ప్రశ్నించారు.
జగన్ మొదట అమరావతిని రాజధానిగా అంగీకరించారని, అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించామని ఆయన చెప్పారు. జగన్కు విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి అన్నారు.