కోల్కతా: ఇటీవల వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడ్డ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాడు. తన బ్యాటింగ్ నైపుణ్యాలకు మెరుగులు పెడుతున్నాడు. బుధవారం నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా విండీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. విరాట్ సాధనలో మునిగిపోయాడు. సోమవారం జట్టు సభ్యులందరికంటే ముందే మైదానంలో అడుగుపెట్టిన విరాట్.. డ్రిల్ ఆరంభానికి ముందే సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అనంతరం సహచరులతో కలిసి ప్రాక్టీస్లో పాల్గొన్న విరాట్ చివరకు గంటకు పైగా నెట్స్లో గడిపాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీతో చర్చిస్తూ కనిపించగా.. ఇతర ఆటగాళ్లు సాధన కొనసాగించారు.
విరాట్ విజృంభిస్తాడు: రాథోడ్
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలోనే తిరిగి పుంజుకుంటాడని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్లో కోహ్లీ పరుగుల వరద పారించడం ఖాయమని పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో విరాట్ 8.6 సగటుతో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి విఫలమైన విషయం తెలిసిందే. సోమవారం రాథోడ్ మాట్లాడుతూ.. ‘అతడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడని చెప్పలేం. విండీస్తో సిరీస్లో పరుగులు చేయలేకపోయాడనేది వాస్తవమే అయినా.. అతడి బ్యాటింగ్లో ఎలాంటి లోపం లేదు. నెట్స్లో చక్కగా ఆడుతున్నాడు. మ్యాచ్కు సిద్ధమవడంలో కోహ్లీ అప్రమత్తంగా ఉంటాడు. అందరూ అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు’ అని అన్నాడు. ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసే పనిలో ఉన్నామన్న రాథోడ్.. రిషబ్ పంత్ను ఓపెనర్గా పరిగణించబోమని స్పష్టం చేశాడు. విండీస్తో రెండో వన్డేలో పంత్ ఓపెనింగ్ చేసిన నేపథ్యంలో రాథోడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
అభిమానులకు అనుమతి!
పొట్టి సిరీస్లో రెండో మ్యాచ్ నుంచి ప్రేక్షకులను అనుమతిస్తే బాగుంటుందని బెంగాల్ క్రికెట్ సంఘం(క్యాబ్).. బీసీసీఐని కోరింది. కరోనా వైరస్ ప్రభావం కారణం గా అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డే సిరీస్ను ఖాళీ మైదానంలో నిర్వహించగా.. తొలి టీ20కి కూడా ప్రేక్షకులను అనుమతించడంలేదు. అయితే దేశంలో ఇప్పుడిప్పుడే కొవిడ్-19 ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో రెండో మ్యాచ్ నుం చైనా అభిమానులను అనుమతించాలని క్యాబ్.. బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం స్పా న్సర్ బాక్స్లతో పాటు బాల్కనీలోని చివరి వరుస సీట్లలో మాత్రమే ప్రేక్షకులకు అనుమతి ఉంది. దీన్ని వచ్చే రెండు మ్యాచ్ల్లో మరింత పెంచాల్సిందిగా క్యాబ్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా.. గంగూలీని కోరాడు.
సుందర్కు గాయం సిరీస్కు దూరం
టీమ్ఇండియాను గాయాల బెడద వెంటాడుతున్నది. వెస్టిండీస్తో టీ20 సిరీస్కు ముందు స్టార్ బ్యాటర్ లోకేశ్ రాహుల్తో పాటు స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ జట్టుకు దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలో మరో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ చేరాడు. కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న సుందర్ బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల సిరీస్కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది.‘కండరాల్లో ఇబ్బంది కారణంగా వాషింగ్టన్ ప్రాక్టీస్లో పాల్గొనలేదు. ఐదు రోజుల వ్యవధిలో మూడు టీ20లు జరుగనుండగా.. అప్పటి వరకు అతడు కోలుకోవడం కష్టమే. దీంతో అతడు పొట్టి సిరీస్కు దూరమయ్యాడు’అని బోర్డు వెల్లడించింది.