న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం అంశాలపై ఇవాళ లోక్సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. రెండవ రోజు వర్షాకాల సమావేశాల సందర్భంగా విపక్షాలు వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాలు జరగుతున్న సమయంలో విపక్ష సభ్యులు ప్లకార్డులతో స్పీకర్ చైర్ను చుట్టుముట్టారు. దీన్ని స్పీకర్ ఓం బిర్లా ఖండించారు. రూల్స్ ప్రకారం.. సభలోకి ప్లకార్డుల అనుమతి లేదన్నారు. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
రాజ్యసభలోనూ ఇదే తరహా గందరగోళం నెలకొన్నది. ధరల పెరుగుదల, ఆహార పదార్ధాలపై జీఎస్టీ అంశాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.