హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఉద్యమ కాలం నుంచి నేటి దాకా తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వార్తలు ప్రచురిస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు లోక్సభ సచివాలయంలోని సభాహక్కుల, నైతిక విలువల విభాగం మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ రెండు పత్రికలూ సభా హక్కుల ఉల్లంఘనకు, సభా ధిక్కారానికి పాల్పడినట్టు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ చేస్తున్నట్టు అది పేర్కొన్నది.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధానమంత్రి మోదీ ఈ నెల 8న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యాఖ్యలను, సభా వ్యవహారాలను నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు వక్రీకరించాయని, తప్పుగా ప్రచురించాయని ఆరోపిస్తూ, స్పీకర్ ఓం బిర్లాకు అర్వింద్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్పీకర్.. సభా హక్కుల కమిటీకి పంపించారు. ‘ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను విమర్శించలేదు.
రాష్ట్ర విభజన జరిగిన పద్ధతి ఆమోదయోగ్యంగా లేదని మాత్రమే ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి జరిగిన వ్యవహారం మొత్తాన్నీ అప్పటి ప్రభుత్వం పథకం ప్రకారం నడిపించింది (కొరియోగ్రాఫ్డ్ బై ది దెన్ గవర్న్మెంట్)’ అని అరవింద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సభా హక్కుల కమిటీ ఈ మెయిల్ ద్వారా నోటీసులు జారీ చేసింది. 72 గంటల్లోగా వీటికి జవాబులివ్వాలని నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల సంపాదకులను ఆదేశించింది.