న్యూఢిల్లీ: ఇటీవల దారుణ హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ఇవాళ పార్లమెంట్ నివాళి అర్పించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత.. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. జపాన్ మాజీ ప్రధాని మృతి పట్ల సంతాపం తెలిపారు. జూలై 8వ తేదీన జపాన్లోని నారా పట్టణంలో ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ ఆగంతకుడు అబేపై తుపాకీతో కాల్పులు జరిపారు. గతంలో భారత పార్లమెంట్లో అబే ఇచ్చిన సందేశాన్ని స్పీకర్ ఓం బిర్లా గుర్తు చేశారు. అబేకు నివాళి అర్పించిన తర్వాత లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాజ్యసభలోనూ అబే మృతి పట్ల నివాళి అర్పించారు. చైర్మెన్ వెంకయ్యనాయుడు నివాళి సందేశాన్ని వినిపించారు. భారత్, జపాన్ మధ్య బలమైన బంధం ఏర్పడడంలో షింజో అబే ఎంతో సహకరించినట్లు వెంకయ్య తెలిపారు. అబే మృతికి గౌరవ సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.