న్యూఢిల్లీ: పత్రికల్లో వస్తున్న ఓ యాడ్ అందరూ కళ్లింత చేసుకుని చూసేలా చేస్తున్నది. లాండోమస్ అనే అమెరికా కంపెనీ పేరిట ఆ యాడ్ విడదలైంది. బయట పెద్దగా ఎవరికీ తెలియని ఓ కంపెనీ భారత్లో భూరి పెట్టుబడులకు ప్రధాని నరేంద్ర మోదీ అనుమతిని కోరడం ఆ యాడ్ సారాంశం. భారత్లో 500 బిలియన్ డాలర్లు.. అంటే రూ.37 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. మౌలిక, మౌలికేతర రంగాల్లో దేనిలోనైనా తమకు ఆమోదమేనని తెలిపింది. ఇంధనం, సామాజిక మౌలికరంగం, ఉత్పాదన, రవాణా, ఆహార శుద్ధి, వ్యవసాయం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి రంగాలను ఈ సందర్భంగా కంపెనీ ప్రస్తావించింది. భారత్ను ప్రపంచ వాణిజ్య గమ్యస్థానంగా మార్చాలని భావిస్తున్నట్టు లాండోమస్ ఆ యాడ్లో పేర్కొన్నది. భారత పునర్నిర్మాణంలో, 5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ సాధనలో ప్రభుత్వానికి సహాయకారిగా ఉండాలని లాండోమస్ గ్రూప్ కోరుకుంటున్నదని తెలిపింది. యాడ్ దిగువన లాండోమస్ గ్రూప్ చైర్మన్ ప్రదీప్కుమార్ ఎస్ అని ఉంది. అయితే అంత పెట్టుబడి పెట్టేవారు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కొరకు ప్రయత్నించకుండా ఇలా పత్రికలో యాడ్ ఎందుకు వేశారని పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. లాండోమస్ రియాలిటీ అనే కంపెనీ 2015 జూలై 17న ప్రభుత్వేతర కంపెనీగా బంగళూరులో రిజిస్టర్ అయినట్టు తెలుస్తున్నది. ఇండియాలో కళ్లు బైర్లు కమ్మే పెట్టుబడులు పెడతానంటున్న కంపెనీ పేడప్ క్యాపిటల్ చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. షేర్ క్యాపిటల్ లక్ష రూపాయలు, పేడప్ క్యాపిటల్ లక్ష మాత్రమే ఉన్నట్టు కంపెనీ వెబ్ సైటులో తెలిపారు. యశస్ ప్రదీప్కుమార్, సత్యప్రకాశ్ ప్రదీప్కుమార్, రక్షిత్ గంగాధర్ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. వెబ్సైటులో మణిపాల్ సెంటర్, డికెన్సన్ రోడ్, బెంగళూరు అనే చిరునామా ఇచ్చారు. యాడ్లో మాత్రం అమెరికా కంపెనీ అన్నట్టుగా ఇచ్చారు. కేంద్ర పెట్టుబడుల విభాగం అధికారులు లాండోమస్ అనే కంపెనీ తమను ఇంతవరకు సంప్రదించలేదని వివరించారు. ఈ ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. లక్ష రూపాయల సొమ్ము కంపెనీ వద్ద ఉంది. కానీ లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని అనడంపై కొందరు జోకులు కూడా వేస్తున్నారు. వ్యాపారవేత్తలకు ప్రధాని అపాయింట్మెంట్ దొరకడం అంత కష్టమా అని మరికొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.