చెన్నై: కరోనా వైరస్ బారినపడి తమిళనాడు జూపార్కులో ఓ ఆడ సింహం మృతిచెందింది. మరో తొమ్మిది సింహాలకు కూడా కరోనా వైరస్ సోకింది. జూ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. వండలూర్లో గల అరైనర్ అన్నా జూలాజికల్ పార్కులో నీల అనే ఆడ సింహం మహమ్మారి బారినపడి మృతిచెందిందని అధికారులు చెప్పారు. జూలోని మొత్తం 11 సింహాలకుగాను ఒక సింహం చనిపోగా మరో తొమ్మిది సింహాలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కాగా, హైదరాబాద్లోని నెహ్రూ జూపార్కులో కూడా ఇటీవల ఎనిమిది సింహాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అన్నీ కోలుకున్నాయి.