న్యూఢిల్లీ, మే 24: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తన పబ్లిక్ షేర్హోల్డర్లకు త్వరలో తొలి డివిడెండ్ ప్రకటించే అవకాశం ఉంది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కార్పొరేట్ ఫలితాల్ని ప్రకటించేందుకు డైరెక్టర్ల బోర్డ్ ఈనెల 30న సమావేశమవుతుందని ఎల్ఐసీ ఎక్సేంజీలకు తెలిపింది. ఇదే సమావేశంలో డివిడెండ్ చెల్లింపు ప్రతిపాదనపైనే నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. సంస్థ ఇటీవల పబ్లిక్ ఆఫర్ జారీచేసేంతవరకూ పూర్తి ప్రభుత్వ సంస్థగా ఉన్నందున, డివిడెండ్లను ప్రభుత్వమే అందుకుంటూ వచ్చింది. ఐపీవో తర్వాత ఎల్ఐసీ వాటాదారులైన పబ్లిక్ ఇన్వెస్టర్లకు సైతం ఇకనుంచి సంస్థ డివిడెండు అందనుంది. ఎల్ఐసీ షేర్లు మే 17 స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయిన సంగతి తెలిసిందే.
ఎల్ఐసీ షేరు లిస్టయిన తర్వాత ఐదు ట్రేడింగ్ సెషన్లలో నాలుగు సందర్భాల్లో నష్టాల్ని చవిచూసింది. సంస్థ డివిడెండు ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలతో మంగళవారం ఈ షేరు 1 శాతం మేర పెరిగి రూ. 826 వద్ద ముగిసింది. ఐపీవో ధర రూ.949తో పోలిస్తే 8 శాతం తక్కువగా రూ.872 వద్ద ఎల్ఐసీ షేరు లిస్టయిన సంగతి తెలిసిందే.