వచ్చే వారంలో సెబీ చెంతకు ప్రాస్పెక్టస్ -దీపం కార్యదర్శి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ మెగా ఐపీవో ప్రక్రియ వేగవంతమయ్యింది. ఎల్ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం ముసాయిదా ప్రాస్పెక్టస్ పత్రాల్ని వచ్చే వారంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సమర్పించనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్యదర్శి తుహిన్ పాండే వెల్లడించారు. అయితే ఐపీవోకు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ అనుమతి రావాల్సి ఉందని, వచ్చినంతనే వాటా విక్రయ వివరాలతో కూడిన ముసాయిదా పత్రాల్ని సెబీకి ఇస్తామన్నారు. సెబీ అనుమతించిన అనంతరం మార్చి నెలలో మార్కెట్లోకి ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్ వచ్చే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి డిజిన్వెస్ట్మెంట్ ద్వారా సమకూరే నిధుల అంచనాల్ని రూ. 78,000 కోట్లకు తగ్గిస్తున్నట్లు సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఎయిర్ ఇండియా, ఇతర ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 12,000 కోట్లు కేంద్రానికి సమకూరాయి. అలాగే బడ్జెట్ ప్రతిపాదనల సమర్పణ సందర్భంలో ‘ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ త్వరలోనే వస్తుందని భావిస్తున్నాం’ అంటూ ఆర్థిక మంత్రి సైతం ప్రకటించడం గమనార్హం.
క్యాబినెట్ ముందుకు ఎఫ్డీఐ ప్రతిపాదన..
ఎల్ఐసీ ఐపీవోలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసేందుకు వీలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పాలసీలో చేపట్టిన మార్పులకు ఆమోదాన్ని కోరుతూ ఒక ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ముందు ఉంచనున్నట్లు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల సంప్రదింపులు తుదిదశలో ఉన్నాయని, అన్ని శాఖలూ ఎఫ్డీఐ పాలసీలో మార్పులకు మద్దతు ఇస్తాయని భావిస్తున్నామన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయాల్ని తీసుకున్న తర్వాత ఎల్ఐసీ వాటా విక్రయానికి అనువుగా ఎఫ్డీఐ పాలసీలో మార్పుల్ని డీపీఐఐటీ సిద్ధంచేసింది. బీమా రంగంలో ఆటోమేటిక్ మార్గంలో 74 శాతం విదేశీ పెట్టుబడుల్ని ప్రస్తుత ఎఫ్డీఐ విధానం అనుమతిస్తున్నది. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు సంబంధించిన ఎల్ఐసీ చట్టానికి ఎఫ్డీఐ విధానం వర్తించదు. ఈ చట్టంలో విదేశీ పెట్టుబడుల నిబంధన ఏదీ లేదు. సెబీ నిబంధనల ప్రకారం ఐపీవోల్లో ఎఫ్పీఐ, ఎఫ్డీఐలు రెండింటికీ అనుమతి ఉంది.
మార్కెట్ విలువ రూ.43.40 లక్షల కోట్లకు బ్రాండ్ విలువ ఆధారంగా ఎల్ఐసీ మార్కెట్ విలువ 2022లో 59.21 బిలియన్ డాలర్లకు (రూ.43.40 లక్షల కోట్లు) చేరుతుందని బ్రాండ్ ఫైనాన్స్ అంచనా వేసింది. 2027కల్లా ఈ సంస్థ మార్కెట్ విలువ 78.63 బిలియన్ డాలర్లకు (రూ.58.9 లక్షల కోట్లు)
పెరుగుతుందన్నది.
ఎల్ఐసీ బ్రాండ్ @ 8.65 బిలియన్ డాలర్లు
ఐపీవోకు సిద్ధమవుతున్న ఎల్ఐసీ..8.65 బిలియన్ డాలర్ల (రూ.64,722 కోట్లు) బ్రాండ్ విలువతో దేశీయంగా అత్యంత విలువైన, పటిష్టవంతమైన బ్రాండ్గా ఆవిర్భవించింది. అలాగే గ్లోబల్ ఇన్సూరెన్స్ బ్రాండ్లలో విలువరీత్యా పదో స్థానాన్ని ఆక్రమించగా, పటిష్ఠతలో మూడో స్థానాన్ని పొందింది. బ్రాండ్ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం 2021లో ఎల్ఐసీ బ్రాండ్ విలువ అంతక్రితం ఏడాదికంటే 6.8 శాతం వృద్ధిచెంది 8.11 బిలియన్ డాలర్ల నుంచి 8.65 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయంగా అత్యంత విలువైన బ్రాండ్లలో (అన్ని రంగాలకు సంబంధించి) ఎల్ఐసీ 206వ స్థానంలో నిలిచింది. కాగా గ్లోబల్ టాప్ టెన్ ఇన్సూరెన్స్ బ్రాండ్లలో 5 చైనాకు చెందినవే ఉన్నాయి. చైనా బీమా కంపెనీ పింగ్ యాన్ ఇన్సూరెన్స్ టాప్ గ్లోబల్ బీమా బ్రాండ్గా కొనసాగుతున్నది. టాప్-10 జాబితాలో రెండు అమెరికా కంపెనీలు, ఫ్రాన్స్, జర్మనీల నుంచి ఒక్కో కంపెనీ ఉన్నాయి.
సంస్థ విలువను నిర్ధారించాం..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఎంబడెడ్ విలువను నిర్ధారించామని తుహిన్ పాండే వెల్లడించారు. బీమా కంపెనీలకు స్టాటస్టికల్, ఇతర సర్వీసులు అందించే మిల్లిమాన్ అడ్వయిజర్స్ ఎల్ఎల్పీ…సంస్థ విలువను లెక్కించిందన్నారు. ఎంబడెడ్ వాల్యూ మెథడ్ ప్రకారం భవిష్యత్లో వచ్చే లాభాల ఆధారంగా ప్రస్తుత కంపెనీ విలువను లెక్కిస్తారు. ఈ విలువలో సంస్థ ప్రస్తుత నికర ఆస్తుల విలువ (ఎన్ఏవీ)ని కూడా కలుపుతారు. ముసాయిదా ప్రాస్పెక్టస్లో ఆఫర్ పరిమాణాన్ని తెలియపరుస్తామని, వివిధ అంశాలపై ప్రస్తుతం తాము సెబీని సంప్రదిస్తున్నామని పాండే తెలిపారు. ఎల్ఐసీ ఐపీవోలో కొంత భాగాన్ని..ఐఆర్ఎఫ్సీ, రైల్టెల్ ఐపీవోల్లానే యాంకర్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేస్తున్నామని, ఇష్యూలో 10 శాతం పాలసీ హోల్డర్లకు రిజర్వ్చేయడం జరుగుతుందని వివరించారు.