నిజాం పాలనలో ప్రజలు విజాతీయ సంస్కృతీ భాషలతో నలిగిపోయారు. నాలుగు శాతం అక్షరాస్యతతో అజ్ఞానాంధకారంలో ఉండిపోయారు. భాషా సంస్కృతి, సాహిత్యానికి దూరమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి 19వ శతాబ్దం ఆరంభంలో తెలంగాణలో గ్రంథాలయోద్యమం ఆరంభమైంది.
1901లో కొమర్రాజు లక్ష్మణరావు పంతులు, మునగాల రాజా నాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలైనవారు ‘శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం’ పేరుతో గ్రంథాలయాన్ని స్థాపించారు. ఇది తెలంగాణలో గ్రంథాలయోద్యమానికి నాంది పలికింది. హన్మకొండలో ‘రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయం’, ఖమ్మంలో ‘ఆంధ్రభాషా నిలయం’, సూర్యాపేటలో ‘ఆంధ్రవిద్యార్థి సంఘ గ్రంథాలయం’.. ఈ విధంగా ఎన్నో గ్రంథాలయాలు తెలంగాణ ప్రాంతంలో స్థాపించబడ్డాయి.
1925-27 మధ్యకాలంలోనే తెలంగాణలో దాదాపు 110 గ్రంథాలయాలు స్థాపించబడినాయి. ఈ గ్రంథాలయాలు ప్రజల్లో భాషాచైతన్యం, సాహిత్య చైతన్యం తీసుకొచ్చాయి. ఈ గ్రంథాలయాల్లో రాత్రిబడులు నడుపబడటంతో చాలామంది తెలుగు రాయటం, చదవటం నేర్చుకున్నారు. పుస్తక పఠనం, పత్రికా పఠనం విస్తరించింది. ప్రజల్లో విజ్ఞానం, చైతన్యం ప్రసరించింది.
గ్రంథాలయాల స్థాపన కాలంలోనే తెలంగాణలో తెలుగు పత్రికలు కూడా వచ్చాయి. 1886లో వచ్చిన ‘శేద్య చంద్రిక’ తెలంగాణలో మొట్టమొదటి పత్రిక. అయితే.. ఇది రెండు, మూడు సంచికలతోనే ఆగిపోయింది. 1913లో పాలమూరు జిల్లా నుంచి ‘హితబోధిని’ అనే తెలుగు మాసపత్రిక వెలువడింది. తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదట కథానికలను ప్రచురించిన పత్రిక ఇదే. ‘రాజయ్య’, ‘సోమయాజులు’ మొదలైన కథలు ఈ పత్రికలో అచ్చయ్యాయి. ఈ కథలను పత్రికా సంపాదకుడు బడారు శ్రీనివాసరావు రచించాడు. ఆయన ‘ఆశాదోషం’ అనే చారిత్రక నవలను కూడా రచించాడు. ‘హితబోధిని’ పత్రికలో వ్యవసాయం, వైద్యం, పారిశ్రామికం, సంఘసంస్కరణ మొదలైన అంశాలను గురించిన వ్యాసాలు ఉండేవి. ఈ పత్రిక 1914లో ఆగిపోయింది. తర్వాత తెలంగాణ నుంచి ప్రసిద్ధమైన వారపత్రిక ‘నీలగిరి’ 1922లో నల్లగొండ నుంచి వెలువడింది. ఆ తర్వాత ఒద్దిరాజు సోదరులు వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామం నుంచి ‘తెనుగు’ అనే పత్రిక 1922లో ఆరంభించారు. ఆ సోదరులు స్వయంగా ఈ పత్రికలను పంపిణీ చేసేవారు. ఈ రెండు పత్రికలు కూడా ఐదేండ్లు ప్రస్థానం సాగించాయి. చదువుకున్న వారినే కాక సామాన్య జనులను కూడా ఈ పత్రికలు చదివింపజేశాయి. ఆ తర్వాత తెలంగాణ నుంచి ‘ఆంధ్రాభ్యుదయం’ అనే వారపత్రిక, ‘సుజాత’ అనే మాసపత్రిక వెలువడ్డాయి. ఈ పత్రికల్లో సాహిత్య సంబంధమైన విమర్శ వ్యాసాలు, కథలు, ప్రహసనాలు ఉండేవి. ఆంధ్రప్రాంత రచయితల రచనలు కూడా వీటిల్లో అచ్చయ్యాయి. ఈ పత్రికలు కూడా 5-6 ఏండ్లు నడిచి ఆగిపోయాయి. 1943 నుండి 1948 వరకు అడవి బాపిరాజు సంపాదకత్వంలో ‘మీజాన్’ పత్రిక నడిచింది. ఈ పత్రికలో అడవి బాపిరాజు నవలలన్నీ ప్రచురింపబడ్డాయి. వామపక్ష భావాలు గల రచయితల రచనలు కూడా దీంట్లో ప్రచురింపబడినాయి.
1940వ దశకంలో ‘తెలుగు తల్లి’, ‘తెలుగుదేశం’, ‘ఆంధ్రకేసరి’ వంటి సాహిత్య పత్రికలు వచ్చాయి.తెలంగాణలో రాజకీయ, సాంఘీక, సాహిత్య చైతన్య ఉద్యమాలలో ప్రముఖపాత్ర వహించిన ‘గోలకొండ పత్రిక’ 1926లో ప్రారంభమైంది. మొదట వారపత్రికగా ఉండి తర్వాత దినపత్రికగా మారింది. ఇది 1947 వరకు సుదీర్ఘకాలం కొనసాగింది. తెలంగాణ ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని నింపిన పత్రిక ఇది. జాతీయ భావాలను వ్యాపింపజేసింది. సాహిత్య పత్రికగా కూడా సాహిత్యాభివృద్ధికి కృషి చేసింది. ప్రసిద్ధ పండితులు ఈ పత్రికలో పనిచేశారు.
1921 సంవత్సరం తెలంగాణ చరిత్రను ఒక కొత్త మలుపు తిప్పింది. 1921 నవంబర్ 11న వివేక వర్ధిని కళాశాలలో కార్వే మహాశయుని అధ్యక్షతన సంఘ సంస్కరణ సభలు జరిగాయి. ఆ సభల్లో మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో వక్తలు ప్రసంగించారు. ఆ రోజు సభావేదికపై ఉన్న న్యాయవాది ఆలంపల్లి వెంకట రామారావు తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించగానే సభికులు (ముఖ్యంగా మహారాష్ట్రకు చెందినవాళ్లు) గోల చేస్తూ ఆటంకం కల్గించారు. తెలుగు వారు దీన్ని పెద్ద అవమానంగా భావించారు. వెంటనే అదే రాత్రి మాడపాటి హన్మంతరావు, బూర్గుల రామకృష్ణారావు, మందుముల నర్సింగరావు, టేకుమళ్ల రంగారావు మొదలైన వారు కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన సమావేశమై ‘ఆంధ్ర జన సంఘం’ను స్థాపించారు.
ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606