APSFTVTDC | ఆంధ్రప్రదేశ్లో సినీ, టెలివిజన్, రంగస్థల కళారంగ అభివృద్ధికి కీలకంగా భావించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటीडీసీ)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కమిటీని నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.కొత్త కమిటీలో చైర్మన్గా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ భరత్ భూషన్ను ఎంపిక చేసింది. అలాగే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ను వైస్ చైర్మన్గా నియమించింది. ఈ నియామకాలతో సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అలాగే కమిటీలో భాగంగా మొత్తం 14 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది.
వీరిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు చోటు దక్కించుకోవడం విశేషం. సీనియర్ నటుడు సుమన్, నటుడు శివాజి, నటి ఝాన్సి, దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి, విజ సముద్ర, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, వివేక్ కూచిభొట్ల, రచయిత బుర్రా సాయి మాధవ్ వంటి వారు డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. అదనంగా రిటైర్డ్ అధ్యాపకుడు, రచయిత డా. కందిమళ్ల సాంబశివరావు, సీనియర్ జర్నలిస్ట్ కె. ఉమా మహేశ్వరరావు, మీర్ ఎస్, ఏ. సత్యనారాయణ, జి. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణలకు కూడా కమిటీలో స్థానం కల్పించారు.
రాష్ట్రంలో సినిమా, టెలివిజన్, నాటక రంగాల అభివృద్ధికి ఈ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది. ముఖ్యంగా భవిష్యత్తులో నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు, సినీ రంగానికి సంబంధించిన ప్రోత్సాహక కార్యక్రమాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో మరిన్ని సినిమా, టీవీ షూటింగ్లు జరగడానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడంతో పాటు, సినీ, టెలివిజన్, రంగస్థల కళాకారుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు సమాచారం.
చైర్మన్:
భరత్ భూషణ్
వైస్ చైర్మన్:
మెహర్ రమేష్
డైరెక్టర్లు:
సుమన్ తల్వార్
శివాజీ
చదలవాడ శ్రీనివాసరావు
బుర్రా సాయిమాధవ్
ఝాన్సీ
వివేక్ కూచిభొట్ల
వి. సముద్ర
కె. ఉమా మహేశ్వరరావు
మీర్ ఎస్
కందిమళ్ల సాంబశివరావు
ఏ. సత్యనారాయణ
ఎస్.వి. కృష్ణారెడ్డి
జి. రాజ్ వెంకటేశ్వర యాదవ్
డి. సత్యనారాయణ
ఈ నియామకాలతో ఆంధ్రప్రదేశ్లో సినీ, టెలివిజన్ రంగ అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.