న్యాల్కల్, ఫిబ్రవరి 3: పాత పంటల్లో పోషక పదార్థాలు అధికంగా ఉంటాయని, సంప్రదాయ పంటల సాగుతోనే జీవితంలో ఆర్థిక అభివృద్ధి త్వరితగతిన సాధ్యమవుతుందని డీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి అన్నారు. న్యాల్కల్ మండలంలోని రేజింతల్ గ్రామంలో శుక్రవారం పాత పంటల జాతర నిర్వహించారు. జాతర ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తైదలు, కొర్రలు, సామలు, సజ్జ, జొన్న, పెసర, మినుము తదితర పంటల్లో అనేక పోషక పదార్థాలు ఉంటాయని తెలిపారు. అనంతరం డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు, మహిళలు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పాత పంటల విత్తనాలను ప్రదర్శిస్తూ ఎడ్లబండ్ల ఊరేగింపు చేపట్టారు. ఊరేగింపులో కోలాటం, చిటికెల రామాయణం, ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ కుత్బుద్దీన్, డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు నర్సమ్మ, మంజుల, కమలమ్మ, పూలమ్మ, వినయ్కుమార్, గ్రామ మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.