న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కేంద్రంలోని బీజేపీ అణచివేత నుంచి దేశ ప్రజలను విముక్తం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే పిలుపునిచ్చారు. యూపీలో కూటమికి నేతృత్వం వహించాలని బీఎస్పీ చీఫ్ మాయావతిని సంప్రదించామని, ఆమె నుంచి స్పందన రాలేదని చెప్పారు. దేశంలో ప్రజలు ధరల పెరుగుదలతో బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల్లేక యువత అల్లాడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాజ్యాంగ సంస్థలను బీజేపీ చెప్పుచేతల్లోకి తీసుకుందని ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు.