కరోనా వైరస్ ప్రమాదం ఇక తప్పినట్లే అనుకుంటున్న తరుణంలో మళ్లా విజృంభిస్తున్నది. ఈసారి ‘ఒమిక్రాన్’ రూపంలో పడగ విప్పుతున్నది. మొదట దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కరోనా వేరియంట్ అంతగా ప్రమాదకారి కాదని అక్కడి వైద్యులు చెప్పుకొచ్చారు. సాధారణ దగ్గు, ఒళ్లు నొప్పుల లాంటి లక్షణాలే తప్ప, ఒమిక్రాన్తో రోగి ప్రాణాలకు ముప్పు లేదని పరిశీలకులు అన్నారు. ఈ వేరియంట్ అతివేగంగా విస్తరిస్తున్నదని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఒమిక్రాన్ నుంచి బయటపడవచ్చునని తెలిపారు. కానీ ఇప్పుడు ఒమిక్రాన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయని వార్తలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒమిక్రాన్ ప్రమాదం ఊహకందని విధంగా ఉన్నదని పేర్కొన్నది. స్థానిక భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చెందుతూ మానవాళిపై కరోనా మహమ్మారి దాడి చేస్తున్నది. ఎన్నో దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ మన దేశంలో కూడా ప్రవేశించింది. అనేక రాష్ర్టాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్నా యి. తెలంగాణలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదు కావటం భయాందోళనకు గురిచేస్తున్నది.
కరోనా మొదటి, రెండో దశల్లో కన్నా ఒమిక్రాన్ వేరియంట్ సంక్లిష్టమైనది. రెండవ దశ లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నది. కొవాగ్జిన్, కొవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్లతో డెల్టా వేరియంట్ కట్టడిలోకి వచ్చింది. రెండు డోసుల టీకాలు తీసుకున్నవారు అంతగా భయపడాల్సిన అవసరం లేని పరిస్థితి రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ కొత్తరూపంలో వచ్చిన ఒమిక్రాన్ వైరస్ వ్యాక్సిన్లకు తలొగ్గని స్థితి కనిపిస్తున్నది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఉన్న రోగ నిరోధకాల నుంచి కూడా ఒమిక్రాన్ తప్పించుకుంటున్నది. వ్యాక్సిన్లు తీసుకున్నవారు కూడా ఒమిక్రాన్ బారినపడే ప్రమాదం ఉన్నది. కాబట్టి రెండు డోసులు తీసుకున్నవారు కూడా నిర్లక్ష్యం చేయకుండా బూస్టర్ డోస్ (మూడో డోసు) తీసుకోవాలి. కేంద్రం వెంటనే దేశ ప్రజలను రక్షించేందుకు బూస్టర్ డోస్కు టీకాలు కొరత లేకుండా చూడాలి.
ముంచుకొస్తున్న ముప్పును రాష్ట్ర ప్రభుత్వం ముందే పసిగట్టింది. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమైం ది. ఆరోగ్య మంత్రి హరీష్రావు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖను సమాయత్తం చేశారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ ప్రభుత్వ దవాఖానల పనితీరును మెరుగుపరుస్తున్నారు. ప్రభుత్వం అన్ని దవాఖానల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నది. అన్ని రకాల వైద్యసేవలు, పరీక్షలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపడుతున్నది. ‘ఒమిక్రాన్’ వైరస్ వ్యాపిస్తే.. రోగులకు తక్షణం చికిత్స అందిం చటం కోసం అత్యవసర సేవల పడకల సంఖ్యను కూడా పెద్ద ఎత్తున పెంచటం అభినందనీయం.
ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజల సహకారం కూడా తప్పనిసరి. ప్రజలంతా వైరస్ వ్యాప్తిని నిలువరించటం కోసం కనీస జాగ్రత్తలు పాటించాలి. మాస్క్ ధరించటంతో పాటు భౌతికదూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం, తరచూ చేతులు కడుక్కోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంతమేర పండుగలు లాంటి సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఒక వ్యక్తి భద్రతకు సంబంధించిన విషయంగా కాకుండా, సామాజిక బాధ్యతగా దీనిని గుర్తించాలి. అందరూ జాగరూకతతో మెలగాలి. అందరి భాగస్వామ్యంతోనే ఒమిక్రాన్ లాంటి వైరస్ను కట్టడి చేయగలుగుతాం. ‘భయం వద్దు, భద్రతా చర్యలు ముద్దు’ అని నినదిస్తూ కరోనా లాంటి విపత్తులు ఎన్ని వచ్చినా ధైర్యంగా ఎదుర్కొందాం!
డాక్టర్ బి.ఎన్.రావు, 98668 34717
(వ్యాసకర్త: ప్రెసిడెంట్ ఎలెక్ట్, స్టేట్ ఐఎంఏ)