తక్కువ ఆదాయ వర్గాల వారికి నాణ్యమైన బడులు అందుబాటులో లేకపోవడం స్మితా దేవ్రాను
ఆవేదనకు గురిచేసింది. వ్యవస్థను, కుటుంబాన్ని మార్చగలిగే శక్తి ఒక్క చదువుకే ఉంది. అంతేకాదు, తన బిడ్డకు అందుతున్న చదువు నాణ్యమైనదేనా? అనే ప్రశ్న ఆమె మనసును తొలిచివేసింది. పిల్లలు నేర్చుకునే పద్ధతిపై అధ్యయనం చేసింది. వీటన్నిటికి పరిష్కారంగా (లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్) లీడ్ స్కూల్ పేరుతో ఓ సంస్థ స్థాపనకు నేపథ్యంగా నిలిచింది.
పదేండ్ల క్రితం స్మితా దేవ్రా, ఆమె భర్త సుమీత్ మెహతా తమ సొంత పాఠశాలలకు దన్నుగా లీడ్ను ప్రారంభించారు. ఇప్పుడది దేశవ్యాప్తంగా 3,500 బడులు, 10 లక్షలకు పైచిలుకు విద్యార్థులకు చేరువైంది. లీడ్లో ప్రస్తుతం రెండువేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది వందకోట్ల డాలర్ల ఆదాయంతో యూనికార్న్ సంస్థల జాబితాలోకి చేరిన లీడ్.. నాణ్యమైన పాఠ్యప్రణాళిక అందజేయడం, దానికి సాంకేతికతను జోడించడం అనే రెండు స్తంభాలపై నడుస్తున్నది.