సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. లష్కర్ వారం సందర్భంగా 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో వారమైన లష్కర్ వారానికి సికింద్రాబాద్కు చెందిన భక్తులతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకొన్నారు. పట్నాలు వేసి, బోనాలు తీసి, ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకొన్నారు. గంగిరేగు చెట్టు వద్ద పూజలు చేశారు. గుట్టపైన ఉన్న ఎల్లమ్మకూ బోనాలు సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తులు పూనకాలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. – చేర్యాల