మామిళ్లగూడెం, జనవరి 5: కొండపల్లి (విజయవాడ) నుంచి కాజీపేట సెక్షన్ వరకు 3వ రైల్వే లైన్ నిర్మాణంతోపాటు విద్యుద్దీకరణ పనుల కోసం ఖమ్మం జిల్లాలో అవసరమైయ్యే భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. ఈ మేరకు గురువారం ఖమ్మం అర్బన్ మండలంలో 3వ రైల్వే లైన్ భూ సేకరణ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానిక నర్తకి థియేటర్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద ప్రాంతాలను కాలినడకన పరిశీలించారు. సారథినగర్, బుర్హాన్పురం తదితర ప్రాంతాల్లో తొలగించాల్సిన ఇళ్లు, కట్టడాలను పరిశీలించారు. రైల్వేలైన్ ఎకడి వరకు వస్తుంది? ఎంత మేరకు భూ సేకరణ అవసరమవుతుంది? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రహదారులు, ప్రభుత్వ కట్టడాల వంటివి ఏ మేరకు ప్రభావితమవుతాయో తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, చింతకాని, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కామేపల్లి మండలాల్లోని 30 గ్రామాల నుంచి 117.19 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్నారు. ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, రైల్వే డివిజనల్ ఇంజినీర్ సూర్యనారాయణ, అర్బన్ తహసీల్దార్ శైలజ, ఆర్అండ్బీ ఏఈఈ విశ్వనాథ్, టీపీవోలు వసుంధర, వికాస్, సంతోశ్, రెవిన్యూ అధికారి జీ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
టీయూఎఫ్ఐడీసీ పనులు ప్రారంభించాలి..
తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా సత్తుపల్లి మున్సిపాలిటీలో రూ.26.94 కోట్లతో పనులను చేపట్టేందుకు అనుమతులు ఇచ్చినట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. టీయూఎఫ్ఐడీసీ పనులపై సత్తుపల్లి మున్సిపల్ ఇంజినీర్లతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లి మున్సిపాలిటీకి టీయూఎఫ్ఐడీసీ ద్వారా అనుమతులు వచ్చిన పనులను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకోవాలని సూచించారు. శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ రాధికా గుప్తా, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, డీఈ నవీన్, సత్తుపల్లి మున్సిపల్ ఏఈ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.