కామారెడ్డి టౌన్, అక్టోబర్ 20 : ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. పరీక్షల ఏర్పాట్లపై కలెక్టరేట్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. పరీ క్షా కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ఒక్కో గదిలో 20 మంది విద్యార్థులకు మించకుండా చర్యలు తీసుకోవాలని, కరోనా లక్షణాలు ఉన్న విద్యార్థుల కోసం ఒక్కో సెంటర్లో రెండు ఐసోలేషన్ గదుల ను సిద్ధం చేయాలన్నారు. కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పా టు చేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి షేక్ సలాం, హైపవర్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
భూ సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలి
భూ వివాదాలు లేకుండా అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. భూ సమస్యలపై రెవెన్యూ, ఫారెస్టు అధికారులతో మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఫారెస్ట్ భూ ములకు బౌండరీలను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. మినీ బృహత్ పార్కుల ఏర్పాటు కోసం బీర్కూర్, దోమకొండ, నస్రుల్లాబాద్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని, ప్రకృతివనాల చుట్టూ గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీఎఫ్వో నిఖిత, ఆర్డీవో రాజాగౌడ్, ఏవో రవీందర్, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఓటరు జాబితాలో తప్పులు సరిచేసుకోవాలి
ఓటర్ల జాబితాలో తప్పులుంటే నవంబర్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు సరిదిద్దుకోవాలని కలెక్టర్ సూచించారు. రాజకీయ పార్టీల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల ముసాయిదా జాబితాను రాజకీయ పార్టీలకు నవంబర్ 1న సీడీ, పెన్డ్రైవ్ రూపంలో అందజేస్తామన్నారు. ఆర్డీవో రాజాగౌడ్, సూపరింటెండెంట్ సరళ, తహసీల్దార్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన కల్పించాలి
గ్రామస్థాయిలో పేద వర్గాలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడంతోపాట ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు ఏర్పాటుచేయాలని సర్పంచులకు కలెక్టర్ జితేశ్ పాటిల్ సూచించారు. అంతకు ముందు నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రేణుక ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని సర్పంచులకు పాన్ఇండియా కార్యక్రమంపై పలు సూచనలు చేశారు.
రుణ లక్ష్యాన్ని పూర్తిచేయాలి
స్వయం సహాయక సంఘాలకు ఈ నెలాఖరులోగా 80 శాతం బ్యాంకు లింకేజీ రుణలక్ష్యాన్ని అధిగమించేలా ఐకేపీ అధికారులు కృషిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి మహిళా సంఘానికీ రుణాలు ఇప్పించాలని సూచించారు.