శ్రీశైలం : పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైలం మహాక్షేత్రంలో బుధవారం భ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చనను వైభవంగా నిర్వహించారు. పరోక్ష సేవగా నిర్వహించిన కుంకుమార్చనలో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి భక్తులు పాల్గొన్నారు. ప్రదోషకాలంలో పౌర్ణమి గడియల్లో కుంకుమార్చనలో భాగంగా మొదట అర్చకులు పూజా సంకల్పాన్ని పఠించారు. ఆ తర్వాత కార్యక్రమంగా నిర్విఘ్నంగా సాగాలని మహాగణతిపూజ నిర్వహించారు.
అనంతరం షోడశోపచార క్రతువులు జరిపి లలితా సహస్రనామ పఠనంతో కుంకుమార్చన వేడుకగా జరిపారు. మంగళకరమైన ద్రవ్యాల్లో కుంకుమకు ఎంతో ప్రాధాన్యం ఉందని, దానితో అమ్మవారిని అర్చించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, సంతాన సౌఖ్యం కలుగుతుందని తెలిపారు. అలాగే పౌర్ణమి సందర్భంగా ఊయల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో లవన్న, ఆలయ అధికారులు పాల్గొన్నారు.