లఖింపూర్ ఖీరీ, ఫిబ్రవరి 15: యావత్ దేశాన్ని కుదిపేసిన యూపీలోని లఖింపూర్ ఖీరీ రైతుల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన ప్రదర్శనలు చేపడుతున్న అన్నదాతలను వాహనాలతో తొక్కించి చంపిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా మంగళవారం సాయంత్రం లఖింపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. సాధారణ ఖైదీల్లా ముందు మార్గం నుంచి కాకుండా.. జైలు వెనుక గేటు నుంచి బయటకు వచ్చిన ఆశిష్ అనంతరం వాహనంలో వెళ్లిపోయారు. రూ. 3 లక్షల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని కోర్టు ఆదేశించిందని ఆశిష్ తరఫు న్యాయవాది అవ్దేశ్ కుమార్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.
ఆ ప్రక్రియను పూర్తిచేశామన్నారు. అయితే ఆశిష్ నగరం విడిచి వెళ్లకూడదన్న నిబంధనలేమీ కోర్టు విధించలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. గతేడాది అక్టోబర్ 3న లఖింపూర్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులను ఆశిష్ మిశ్రా వాహనాలతో తొక్కించినట్టు వీడియోల్లో బయటపడింది. రైతులు, విపక్షాల నుంచి ఒత్తిళ్లు రావడంతో వారం తర్వాత అంటే ఆ నెల 10న ఆశిష్ను అరెస్టు చేశారు. నాలుగు నెలల అనంతరం.. గతవారం ఆశిష్కు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ తీర్పునిచ్చింది. ధ్రువపత్రాల సమర్పణ, పూచీకత్తు ప్రక్రియ అనంతరం మంగళవారం ఆశిష్ విడుదలయ్యారు. ఆశిష్ విడుదలపై కాంగ్రెస్, ఆరెల్డీ, తృణమూల్, పీడీపీ తదితర విపక్షాలు భగ్గుమన్నాయి. లఖింపూర్కు నాలుగో దశలో ఫిబ్రవరి 23న పోలింగ్ జరుగనున్నది. ఇదే సమయంలో ఆశిష్ మిశ్రా జైలు నుంచి విడుదల కావడం గమనార్హం.