బూర్గంపహాడ్, మే 05 : కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ఏ క్షణమైనా సమ్మెకు సిద్ధంగా ఉన్నామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ.యాకూబ్పాషా, ఆకిని సర్వేశ్వరరావు, బల్లెం నాగయ్య స్పష్టం చేశారు. మంగళవారం కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కానీపక్షంలో ఐటీసీ యాజమాన్యం స్పందించాలని రిమైండర్ సమ్మె నోటీసు మరోసారి హెచ్ఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక సమస్యలు, వేతన ఒప్పంద పెండింగ్ సమస్యలపై ఫిబ్రవరి 11న లేబర్ డిపార్ట్మెంట్కు నోటీసు ఇచ్చామని, అయినప్పటికీ యాజమాన్యం, లేబర్ డిపార్ట్మెంట్ కార్మిక జేఏసీతో ఎలాంటి చర్చలు జరపకుండా 14వ వేతన ఒప్పందం గుర్తింపు సంఘంతో కలిసి ఏకపక్షంగా చర్చలు జరిపి కాంట్రాక్టు కార్మికుల వేతన ఒప్పందం పూర్తి చేశారని సమాచారం అందిందన్నారు.
ఈ వేతన ఒప్పందంలో కార్మికులు అడిగిన డిమాండ్లు పరిష్కరించకుండా సరైన న్యాయం జరగకపోతే జనరల్ బాడీ మీటింగ్ తర్వాత ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, దీనికి యాజమాన్యం, లేబర్ కమిషనర్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తొలుత 41వ రోజు చేపట్టిన దీక్షలకు బీఆర్డీయూ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము శంకర్రెడ్డి, శ్రమశక్తి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బీఆర్డీయూ అధ్యక్షుడు కుందూరు పెద్దిరెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు మారం వెంకటేశ్వరరెడ్డి హాజరై కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ దీక్షా కార్యక్రమంలో జేఏసీ బాధ్యులు, జేఏసీ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.