మెదక్ మున్సిపాలిటీ/ వెల్దుర్తి/ కొల్చారం/ చిలిపిచెడ్/ పాపన్నపేట, ఫిబ్రవరి 10 : విద్యార్థులు పరీక్షల భయం వీడాలని, ఇష్టంతో చదవాలని, ఒత్తిడికి గురికావద్దని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీవో భవన్లో వెనుకబడిన తరగతులు అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 22 వస తిగృహాల విద్యార్థులకు ప్రేరణా తరగతు లు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ భవిష్యత్పై మంచి ప్రేరణ కలిగి ఉం డాలన్నారు. పదో తరగతి ఫలితాల్లో మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచాలన్నారు. ఉన్నత చదువులపై విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రేరణ కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అన్ని రకాల పుస్తకాలు, స్టడీ మెటీరియల్తోపాటు క్రమం తప్పకుండా స్నాక్స్ ఆందజేస్తున్నారన్నారు. వసతిగృహాల విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ అవర్స్, ట్యూటర్స్ను నియమించి, తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీవీ, సెల్ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. జిల్లాలోని 22 బీసీ వసతి గృహాల్లో 222 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధంగా ఉన్నారన్నారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు బీసీ సంక్షేమ అధికారి నాగరాజుగౌడ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్, హాస్టల్ వార్డెన్లు పాల్గొన్నారు.
‘పది’ జీవితానికి తొలిమెట్టు
పదో తరగతి ప్రతి విద్యార్థి జీవితానికి తొలిమెట్టు అని డీఈవో రాధాకిషన్ అన్నారు. వెల్దుర్తి మండలంలోని మంగళపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈవో సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టీస్ పరీక్షను పరిశీలించారు. పదిలో ఉత్తమ ఫలితాల సాధనకు తీసుకుంటున్న చర్యలు, ప్రత్యేక తరగతులు, ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహిస్తున్న స్టడీ అవర్స్పై హెచ్ఎం మెహెర్బేగం, ఉపాధ్యాయుడు రామాగౌడ్ను అడిగి తెలుసుకున్నారు. పది విద్యార్థులతో మాట్లాడుతూ విద్యారికి పదో తరగతి అనంతరం భవిష్యత్ను తీర్చిదిద్దుకునేందుకు బాటలు వేసే సమయం ప్రారంభం అవుతుందన్నారు. ప్రతి విద్యార్థి మంచి ఉత్తీర్ణత సాధించి, లక్ష్యాల వైపు సాగాలని కోరారు.
బహుమతులు అందజేత
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాసాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం, కవిత్వం, ఉపన్యాసం, పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు టీచర్ రాజేశ్వరశర్మ తెలిపారు.
వైజ్ఞానిక వైఖరి ఉండాలి
కొల్చారం జడ్పీహెచ్ఎస్లో మండల పరిధిలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వకృత్వం, పెయింటింగ్, పాటలు, కవి త్వం అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో నీలకంఠం మాట్లాడు తూ.. విద్యార్థులు చిన్నప్పటి నుంచే వైజ్ఞానిక వైఖరి అలవర్చుకుని, సామాజిక ధృక్పథంతో సాగుతూ మేధావులుగా, శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, నోడల్ అధికారి సత్యనారాయణ, వరిగుంతం ఉన్నత పాఠశాల హెచ్ఎం జగదీశ్వర్, సీఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.
శాస్త్రీయంగా ఆలోచించాలి
చిలిపిచెడ్ మండల పరిధిలోని చిలిపిచెడ్, చండూర్, చిట్కుల్, గౌతాపూర్, సోమక్కపేట, ఫైజాబాద్ ఉన్నత పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలస్థాయిలో నిర్వహించిన ప్రతిభా పోటీ ల్లో ఫైజాబాద్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నోడల్ అధికారి, హెచ్ఎం విఠల్ తెలిపారు. జిల్లా స్థాయిలో ఎన్నికైన విద్యార్థులు పాటల పోటీలో కీర్తన, ఉపన్యాస పోటీలో హారిక, కవిత/ పద్య పోటీలో వైష్ణవి, చిత్రలేఖనంలో పవన్ ఎంపికయ్యారు. ఆయా కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించాలన్నారు. శాస్త్రీయ భావనలతో నూ తన ఆవిష్కరణలు ఉద్భవిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎంలు వేదశ్రీ, కృష్ణ, తారాసింగ్, హరిసింగ్, నాగరాజు ఉన్నారు.
పాఠశాలల్లో సైన్స్ పోటీలు
పాపన్నపేట ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ పోటీలను శనివారం నిర్వహించినట్లు మండల నోడల్ అధికారి ప్రతాప్రెడ్డి తెలిపారు. చిత్రలేఖనం, కవితలు, పాటలు, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. మొదటి స్థానాల్లో నలుగురు విద్యార్థులను జిల్లా స్థాయి కి ఎంపిక చేశారు. చిత్రలేఖనంలో భార్గవి, కవితల పోటీల్లో వందన, పాటల పోటీల్లో రేచల్, ఉపన్యాస పోటీల్లో షాహీద్ ఆఫ్రిది ఎంపికయ్యారు. సోమవారం మెదక్లోని బాలికల ఉ న్నత పాఠశాలలో జిల్లాస్థాయి పోటీలు ఉంటాయని ప్రతాప్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం మహేశ్వర్, ఉపాధ్యాయులు ప్రవీణ్కుమార్, అశోక్, నాగరాజు, శశికుమార్ రెడ్డి, అశోక్ కుమార్, బెండల్ పద్మ, సాయికుమార్, రవీందర్రెడ్డి, నర్సింహులు, నరేందర్, తులసీ రాం, ప్రసాద్, బాలరాజు పాల్గొన్నారు.