హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని చేనేత, జౌళి, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్ అభివృద్ధి పథకం (సీపీసీడీఎస్) కింద సిరిసిల్లలో క్లస్టర్ ఏర్పాటుచేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్కు కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. గతంలో ఇదే అంశంపై ఏడుసార్లు లేఖలు రాశామని, వ్యక్తిగతంగా కలిసి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించామని, అయినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసంతృప్తిని వ్యక్తంచేశారు.
చేనేత, జౌళి రంగానికి సిరిసిల్ల దశాబ్దాలుగా ప్రధాన కేంద్రంగా (మేజర్హబ్) ఉన్నదని లేఖలో మంత్రి కేటీఆర్ వివరించారు. సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. చేనేత, జౌళిరంగం సర్వతోముఖాభివృద్ధికి, నేతన్నల శ్రేయస్సుకు అనేక పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన వ్యవస్థతోపాటు, శిక్షణ పొందిన కార్మికులు సిరిసిల్లలో పుష్కలంగా ఉన్నారని వెల్లడించారు. 40% ఇన్పుట్ సబ్సిడీ వేజ్ కాంపెన్సేషన్ స్కీమ్, థ్రిఫ్ట్ ఫండ్ వంటి పథకాలతో చేనేత, పవర్లూమ్ కార్మికులకు నిరంతరం పని కల్పించి, ఆదాయం పెంపునకు కృషి చేస్తున్నామని తెలిపారు. తమ కార్యక్రమాలతో పరిశ్రమ పునరుజ్జీవం దిశగా సాగుతున్నదని, నేత కార్మికుల ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు.
తెలంగాణ రాష్ర్టానికి, చేనేత జౌళిరంగానికి కేంద్రం నుంచి చెప్పుకోదగ్గ సహకారం అందడంలేదని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ర్టానికి కేంద్రం ప్రాధాన్యం ఇవ్వక పోవడంతో మన దేశం చిన్న దేశాలతో కూడా పోటీ పడలేక పోతున్నదని పేర్కొన్నారు. టెక్స్టైల్ రంగంలో రాష్ట్రం ఇప్పటికే భారీగా పెట్టుబడులు ఆకర్షించిందని, ఇతర దేశాలతోనూ నేడు తెలంగాణ పోటీ పడుతున్నదని వివరించారు. చేనేత, జౌళి రంగానికి అదనపు బడ్జెట్ను కేటాయించడమే కాకుండా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు వంటి ప్రపంచస్థాయి ప్రాజెక్టులను చేపట్టామని గుర్తుచేశారు. కేంద్రం సరైన వ్యవస్థ, వనరులులేని రాష్ర్టాలకు సహాయం చేస్తూ, వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలను ప్రోత్సహించకపోవటం అత్యంత నష్టదాయకమని అన్నారు. మెగా పవర్లూమ్ క్లస్టర్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఏర్పడే ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, ఆలస్యం చేయకుండా తక్షణమే క్లస్టర్ను ఏర్పాటుచేయాలని కోరారు.