హైదరాబాద్ : సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై లైంగిక దాడి, హత్య ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆరు సంవత్సరాల చిన్నారి లైంగిక వేధింపులు, హత్య వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని, నేరస్తుడిని గంటల వ్యవధిలో అరెస్టు చేసినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. చిన్నారిపై అకృత్యానికి పాల్పడ్డ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని హోం మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీకి కేటీఆర్ సూచించారు.
నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై ఓ కిరాతకుడు లైంగిక దాడి చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. కాలనీకి చెందిన ఓ చిన్నారి గురువారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయ్యే వరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఆ ఏరియాలో జులాయిగా తిరిగే ఆటో డ్రైవర్ రాజుపై స్థానికులకు అనుమానం వచ్చింది. చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడే పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా బాలిక విగతజీవిగా పరుపులో చుట్టి ఉంది. ఈ ఘటనతో ఒక్కసారిగా చిన్నారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించగా.. స్థానికులు షాక్కు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. అయితే నిందితుడు రాజును తమకు అప్పగించే వరకూ పాప మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేది లేదని బస్తీవాసులంతా నిరసనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. నిందితుడు రాజును యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో శుక్రవారం అరెస్టు చేశారు. స్వగ్రామానికి వచ్చాడని గుర్తించిన పోలీసులు.. శుక్రవారం అర్ధరాత్రి అతడిని అదుపులోకి తీసుకొని, హైదరాబాద్ తరలించారు. లైంగిక దాడి చేసి.. గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్ట్మార్టం నివేదికలోనూ వెల్లడైంది.