హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశంలోని వివిధ కంపెనీల అధిపతులు, సీఈవోలతో గురువారం సమావేశమయ్యారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలు, పెట్టుబడులకు రాష్ట్రంలోని అనుకూలతలను వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
కేటీఆర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం గురువారం వరుస సమావేశాలతో బిజీగా గడిపింది. ఫ్రాన్స్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆయా రంగాల్లో ఉన్న అవకాశాలు, ప్రాధాన్య రంగాల గురించి కేటీఆర్ వివరించారు. క్షిపణులు, క్షిపణి వ్యవస్థల అభివృద్ధిలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన ఎంబీడీఏ డైరెక్టర్లు సోలోమియాక్, పోల్ నీల్ లే లైవ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఆసియా, ఇండియా) జీన్-మార్క్ పెరౌడ్ తదితరులతో కేటీఆర్ బృందం సమావేశమైంది. తెలంగాణలో క్షిపణి తయారీ వ్యవస్థ అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. అనంతరం ఏరోక్యాంపస్ అక్విటైన్ సేల్స్ డైరెక్టర్ జేవియర్ ఆడియన్తో సమావేశమయ్యారు. ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎయిర్ కమోడోర్ హిలాల్ అహ్మద్ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఫ్రాన్స్లో భారత రాయబారి జావెద్ ఆష్రాఫ్తో కేటీఆర్ బృందం సమావేశమైంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. అనంతరం కాస్మొటిక్ వ్యాలీ డిప్యూటీ ఇంచార్జి సీఈవో ఫ్రాంకీ బెచెరోతో భేటీ అయ్యారు. భారతదేశ సౌందర్య సాధనాల మార్కెట్తోపాటు ఈ రంగం గణనీయ అభివృద్ధిని ఆమెకు వివరించారు. తెలంగాణలో కాస్మొటిక్స్ రంగానికి ఉన్న అవకాశాలను తెలిపారు. ఫ్రాన్స్లోని కాస్మొటిక్ వ్యాలీ.. సౌందర్య సాధనాలకు సంబంధించిన దాదాపు 800 కంపెనీలు కొలువైన ప్రాంతం. 70 వేల మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తుంటారు. 11 బిలియన్ల ఆదాయం, ఏడు యూనివర్సిటీలు, 136 కాలేజీలు, 200 పరిశోధనా సంస్థలు, 8,600 మంది పరిశోధకులు, 100 రిసెర్చ్ ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నాయి. మంత్రి కేటీఆర్ వెంట పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు ఉన్నారు.