హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ)/పాలకుర్తి: టీఎస్ఆర్టీసీ లోగో విషయంలో కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న వ్యక్తులపై కేసులు ఎందుకు పెట్టడంలేదని డీజీపీ రవిగుప్తా, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశ్నించారు. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే మిమ్మల్ని కూడా కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. టీఎస్ఆర్టీసీ కొత్త లోగో వివాదంపై శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించా రు. ఆర్టీసీ కొత్త లోగో అంటూ ప్రచారం చేసిన ఎన్టీవీ, బిగ్టీవీ చానెళ్లు, వెలుగు దినపత్రికపై ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు. తన బంధువుకు రూ.10 వేల కోట్ల కొవిడ్ కాంట్రాక్ట్ వచ్చిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారని, సచివాలయం కందకాల్లో నిజాం నగలు తవ్వుకున్నట్టు నకిలీ కథలు అల్లారని గుర్తుచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా నకిలీ వీడియోను రేవంత్రెడ్డి ప్రచారం చేశారని పేర్కొన్నా రు. ఓయూకు చెందిన నకిలీ సర్క్యులర్ ను సీఎం పోస్ట్ చేశారని, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న ఆ వ్యక్తిని జైల్లో ఎందుకు పెట్టడంలేదని పోలీసు యం త్రాంగాన్ని ప్రశ్నించారు.
బెదిరేది లేదు: దిలీప్
సీఎం రేవంత్రెడ్డి ప్రోద్బలంతోనే పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కోణతం దిలీప్ ఆరోపించారు. ఇలాంటి కేసులు ఎన్నిపెట్టినా బెదిరేది లేదని, న్యా యస్థానాల మీద పూర్తి నమ్మకం ఉన్నదని ఎక్స్ వేదికగా శుక్రవారం పేర్కొన్నారు. రేవంత్రెడ్డి సర్కారు కేసీఆర్ ప్రభుత్వ ఆనవాళ్లు తుడిచేస్తామంటూ వివిధ సంస్థల పేర్లు మార్చే పనికిమాలిన పని ఒకటి పెట్టుకున్నదని, దీనిలో భాగంగానే టీఎస్ఆర్టీసీ సంస్థ పేరును టీజీఎస్ ఆర్టీసీగా మా ర్చిందని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక వాట్సాప్ గ్రూపులో ఆర్టీసీ కొత్త లోగో అంటూ ఒక ఇమేజ్ పంపారని, ఆ లోగోను 22న అనేక మీడియా సంస్థలు ప్రచురించాయని తెలిపారు. కొత్త లోగోలో పాత ఆర్టీసీ లోగోలో ఉన్న చార్మినార్, కాకతీయ తోరణం లేకపోవడం గు రించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాన ని పేర్కొన్నారు.
ప్రశ్నించే గొంతులపై కేసులు: హరీశ్రెడ్డి
ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భయందోళనకు గురిచేస్తున్నదని బీఆర్ఎస్ ఎన్నారై సెల్ నాయకుడు వ్యాళ్ల హరీశ్రెడ్డి ధ్వజమెత్తారు. గాంధీ దవాఖానలో కరెంటు పో యిన వీడియో, ఆర్టీసీ లోగోపై తాను చేసి న పోస్టులను అడ్రస్ చేసుకుంటూ కేసులు పెట్టారని విమర్శించారు. గాంధీ దవాఖానలో కరెంటు పోయిన విషయం పాత వీడియో అని తెలిసి వెంటనే డిలీట్ చేసినా కావాలని కేసు పెట్టారన్నారు.